చేవెళ్ల ఎంపీ కొండా అరెస్ట్‌..విడుదల 

16 May, 2019 01:48 IST|Sakshi

హైదరాబాద్‌: తన ఇంటికి నోటీసు ఇవ్వడానికి వచ్చిన గచ్చిబౌలి ఎస్‌ఐ కృష్ణ, కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు ఆయన కార్యాలయంలో ఉద్యోగి చంద్రప్రకాశ్, ఆయన పీఏ వై.హరిప్రసాద్‌లకు బంజారాహిల్స్‌ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్‌ చేసి బెయిల్‌ మంజూరు చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కొండా అనుచరుడు సందీప్‌రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు పంపిణీ చేస్తుండగా గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. సందీప్‌పై కేసు నమోదు చేశారు.  ఏప్రిల్‌ 16న ఎస్‌ఐ కృష్ణ, కానిస్టేబుల్‌తో కలిసి బంజారాహిల్స్‌లోని కొండా నివాస కార్యాలయానికి వచ్చారు.

ఆ సమయంలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఎస్‌ఐ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 29న నాంపల్లి రెండవ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ముందస్తు తీర్పునిస్తూ కొండాతోపాటు చంద్రప్రకాశ్, హరి ప్రసాద్‌లను అరెస్ట్‌ చేసే ముందు వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని బెయిలివ్వాలని ఆదేశించారు.  దీంతో రూ.25 వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించిన విశ్వేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఆయన ఉద్యోగులను కూడా రూ.5 వేల చొప్పున పూచికత్తులు తీసుకొని విడుదల చేశారు.  

మరిన్ని వార్తలు