వేల కోళ్లు ఉచిత పంపిణీ..

19 Mar, 2020 14:33 IST|Sakshi

సాక్షి, నర్సాపూర్‌ రూరల్‌ /వెల్దుర్తి (తూప్రాన్‌): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. చికెన్‌, గుడ్లు తినవడం వల్ల వైరస్‌ వస్తుందన్న వదంతులతో ఫౌల్ట్రీ రంగం తీవ్రంగా నష్టపోయింది. కొనేవారు లేక కోళ్లను ఉచితంగా రైతులు పంచిపెడుతున్నారు. మెదక్‌ జిల్లాలో కోళ్లకు దాణా పెట్టి మరింత నష్టపోవడం కంటే వాటిని ఉచితంగా పంపిణీ చేయడమే మేలనుకొని వెల్దుర్తి పట్టణానికి చెందిన ఓ పౌల్ట్రీ యజమాని తన ఫాంలోని సుమారు 5,300 కోళ్లను ఉచితంగా పంచిపెట్టారు. విషయం తెలియడంతో పెద్ద ఎత్తున జనం వచ్చి కోళ్లను పట్టుకెళ్లిపోయారు.

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చెర్వపూర్‌ గ్రామానికి చెందిన పిల్టా స్వామి అనే రైతు కూడా కోళ్లను ఉచితంగా పంచిపెట్టారు. దాదాపు 2 వేల కోళ్లను ట్రక్కుల్లో దుబ్బాక పట్టణానికి తీసుకొచ్చి ప్రజలకు ఉచితంగా ఇచ్చేశారు. కోళ్లను తీసుకునేందుకు జనం ఎగబడటంతో టోకెళ్లు ఇచ్చి పంచిపెట్టారు. తమకు నష్టం కలిగినా ప్రజల్లో ఉన్న భయాందోళ పోగొట్టేందుకు ఈ పని చేసినట్టు స్వామి తెలిపారు. (కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కాదయా!)

తుజాల్‌పూర్‌లో కోళ్లను పాతి పెడుతున్న దృశ్యం

పదివేల కోళ్లు మట్టిపాలు
కరోనా దెబ్బకు చికెన్‌ అమ్మకాలు పూర్తిగా పడిపోవడంతో కోళ్లను పౌల్ట్రీ యజమానులు మట్టిలో కప్పి పెడుతున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన బంజా శ్రీశైలం, కల్లూరి వెంకటమ్మ తమ ఫాంలోని కోళ్లను కొనుగోలు చేసే నాథుడు లేకపోవడంతో ఇద్దరికి సంబంధించి 10వేల కోళ్లను జేసీబీతో గుంతలు తీసి పాతి పెట్టారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. (కరోనాపై కొన్ని అపోహలూ... వాస్తవాలు)

మరిన్ని వార్తలు