చికెన్‌ ధరలు పైపైకి..

15 May, 2018 11:02 IST|Sakshi

హైదరాబాద్, జూబ్లీహిల్స్‌: కోడి మాంసం ధర మళ్లీ కేక పెట్టిస్తోంది. నాలుగు నెలల వ్యవధిలో చికెన్‌ ధర నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.220 కు చేరింది. దీంతో మధ్యతరగతి ప్రజలు చికెన్‌ కొనాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు అధిక ధరల కారణంగా చికెన్‌కు గిరాకీ తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. కాగా గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. గత ఏప్రిల్‌ నెలలో 150 పలికిన ధర తాజాగా 220 రూపాయలకు చేరడం గమనార్హం. గతేడాది మే నెలతో పోల్చుకుంటే ధర దాదాపు రెట్టింపు ఉంది.

ఎండలతో ఉత్పత్తి డీలా  
చిన్నచిన్న రైతులు కోళ్ల పెంపకానికి దూరంగా ఉండడం, వేసవిలో అధిక వేడికి ఉత్పత్తి పడిపోవడం వంటి కారణాల వల్ల చికెన్‌ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. కాగా చికెన్‌ ధరలపై ప్రభుత్వ నియంత్రణ  ఉంటే బాగుంటుందని కొన్ని వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రభుత్వం నియంత్రించాలి...
న్యాయంగా అయితే కిలో కోడి స్కిన్‌లెస్‌ ధర రూ.150 నుండి రూ.170 మధ్య ఉండాలి. ఇది ఇటు వ్యాపారికి, ఇటు కొనుగోలుదారులకు మేలు. కోళ్ల దాణాతో పాటు ఇతర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. వాస్తవంగా పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అప్పుడే అందరికీ మేలు జరుగుతుంది. చికెన్‌ మార్కెట్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు గురికాకుండా ప్రభుత్యం పటిష్టమైన చర్యలు తీసుకొని మార్కెట్లను నియంత్రిస్తేనే ఫలితం ఉంటుంది.   – సత్యనారాయణ, చికెన్‌సెంటర్‌నిర్వాహకుడు, యూసుఫ్‌గూడ బస్తీ

మధ్యతరగతికి భారం
అన్ని నిత్యావసరాల ధరల మాదిరిగానే ఇటీవల చికెన్‌ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందే. గతంలో వారానికి కనీసం రెండుసార్లు చికెన్‌ వండుకునేవాళ్లం. ఇప్పుడు ధర బాగా పెరగడంతో వారానికి ఒక్కసారికే సర్దుకుంటున్నాం.   – జయంతి,గృహిణి, రహమత్‌నగర్‌

మరిన్ని వార్తలు