కో‘ఢీ’

27 Dec, 2018 09:03 IST|Sakshi

రికార్డు స్థాయికి చేరిన చికెన్‌ ధర

కిలో రూ.250.. ఇంకా పెరిగే అవకాశం  

డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకే..  

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ మార్కెట్‌లో చికెన్‌ ధర అనూహ్యంగా పెరిగింది. కార్తీకమాసం ముగియడం, పెథాయ్‌ తుఫానుతో పెరిగిన చలి, క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో చికెన్‌ రేటు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రెండు వారాల క్రితం కిలో రూ.170 ఉన్న ధర ఇప్పుడు రూ.250కి చేరింది. చలికాలంలో సాధారణంగా చికెన్‌ ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి గతంలో ఎన్నుడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి.

ఆదివారం మాత్రం 70 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయని అంచనా. ఈ క్రిస్మస్‌కు మాత్రం 1.5 కోట్ల కిలోల విక్రయాలు దాటాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. నగర హోల్‌సేల్‌ మార్కెట్‌లో కోడి కిలో రూ.135 నుంచి రూ.140 మధ్య ఉంది. రిటైల్‌ మార్కెట్‌లో రూ.150 వరకు ఉంది. డ్రెస్‌డ్‌ ధర రూ.200 వరకు ఉండగా, స్కిన్‌లెస్‌ రూ.240 దాటుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

డిమాండ్‌ తగ్గ సరఫరా లేదు
రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కోళ్ల సరఫారా లేకపోవడంతో చికెన్‌ ధరలు పెరిగుతున్నాయి. న్యూయర్‌ దాకా ధరలు ఇలాగా ఉంటాయి. ఫారంరేట్‌ కోడి ధర కిలో రూ.110 దాటింది. ఇందులో 33 శాతం ధరలు కలుపుకొని హోల్‌సెల్‌ వ్యాపారులు కిలో రూ.135 వరకు విక్రయిస్తారు. స్కిన్‌లెస్‌ కిలో హోల్‌సేల్‌ రూ.220 దాటింది. వినియోగదారులు ఎప్పటికప్పుడు పేపర్‌ రేటును గమనిస్తూ దాని ప్రకారమే చికెన్‌ కొనాలి. అంతకు మించి అధికంగా చెల్లించవద్దు.     – డా.రంజీత్‌ రెడ్డి, తెలంగాణ     బ్రీడర్స్‌ అసోసియోషన్‌ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు