శక్తి యాప్‌తో కార్యకర్తకు శక్తి

28 Jul, 2018 21:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కార్యకర్తలకు శక్తినివ్వడానికే కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శక్తి యాప్‌ను క్రియేట్‌ చేయించారని టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. యాప్‌ రిజిస్ట్రేషన్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అధ్యక్షతన గాంధీభవన్‌లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించడం కోసమే.. ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో భేటీ అయినట్లు తెలిపారు. రాహుల్‌ ఆదేశాల మేరకే శక్తి యాప్‌ రివ్యూ మీటింగ్‌ కోసం చిదంబరం తెలంగాణకు వచ్చారన్నారు.

ప్రతి రోజు కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాన్ని తెలియజేయడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్‌లో శక్తి యాప్‌ మరింత అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే యాప్‌లో లక్ష మెంబర్‌ షిప్‌ దాటిందని ఉత్తమ్‌ తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

వీహెచ్‌ గరంగరం 
అంబర్‌పేటలో నూతి శ్రీకాంత్‌ అనే నేత శక్తి యాప్‌లో కార్యకర్తలను చేర్పించారని తెలిపిన ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డిపై మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను చేర్పించిన ఘనత శ్రీకాంత్‌ ఒక్కడికే ఇవ్వడం సరికాదని వీహెచ్‌ అభిప్రాయపడ్డారు. తన నియోజక వర్గంలో తనకు తెలియకుండా కార్యకర్తలను ఎలా చేర్పిస్తావంటూ రాంమోహన్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనతో పెట్టుకోవద్దంటూ వీహెచ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు