కేసీఆర్‌ పథకాలపై నివేదిక విడుదల 

6 Apr, 2019 04:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల పనితీరుపై ‘టువర్డ్స్‌ గోల్డెన్‌ తెలంగాణ’పేరుతో రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి శుక్రవారం సచివాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని ప్రధాన పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ నివేదికలో క్రోడీకరించారు.

అన్ని సంక్షేమ పథకాలు, కాళేశ్వరం, రైతుబంధు, మిషన్‌ భగీరథ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, టీఎస్‌–ఐపాస్, విద్య, వ్యవసాయం, విద్యుదుత్పత్తి, మహిళా సాధికారత, నీటిపారుదల రంగాలకు సంబంధించిన సమగ్ర గణాంకాలను ఈ నివేదికలో పొందుపరిచారు. టీ–హబ్, టాస్క్, టీ–వర్క్స్, రిచ్‌ వంటి సంస్థల పనితీరును సైతం ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు