పసి మొగ్గలను నలిపేస్తున్న కీచకులకు ఉరే సరి!

9 Aug, 2019 10:35 IST|Sakshi

తాగిన మత్తులోనే అఘాయిత్యాలు

నాలుగేళ్లలో జిల్లాలో 201 కేసులు నమోదు

అన్ని కేసులూ విచారణలోనే..

30 కేసుల్లో డీఎన్‌ఏ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ విచారణ

ఉపేక్షించేది లేదంటున్న అధికారులు

సాక్షి, సిద్దిపేట:  ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా ఏదో ఒక చోట చిన్నారులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వావివరుసలు వయసు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. చట్టం కళ్లు కప్పి తప్పించుకునే వారు కొందరైతే.. చేసిన పాపానికి వడ్డీతో సహా మూల్యం చెల్లించి జీవితాంతం చిత్రహింసలను చవిచూసేవారు మరికొందరు..  ఇటువంటి మానవ మృగాలకు ఏ శిక్ష వేసినా తక్కువే అంటున్నారు జిల్లా ప్రజలు.  ఇటీవల వరంగల్‌లో పసికందుపై అత్యాచారం.. ఆపై హత్య సంఘటన ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. ఆ ఆఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడిన నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశమైంది. నాలుగేళ్లలో జిల్లాలో 201 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ విచారణలో ఉన్నాయి. దీంతో వారికి శిక్ష ఎప్పుడు పడుతుంది. అనేది చర్చించుకుంటున్నారు. పోలీసులు మాత్రం ఎవరి ఉపేక్షిం చేది 
లేదంటున్నారు.    

ఇటీవల వరంగల్‌లో తొమ్మిది నెలల పసికందుపై ఆత్యాచారం ఆపై హత్య సంఘటన ప్రతీ ఒక్కరికి కన్నీరు తెప్పించింది. అయితే ఆ ఆఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడిన నేపథ్యంలో మరోసారి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇటువంటి కేసులు జిల్లాలో కూడా చోటు చేసుకోవడంతో వారికి శిక్ష ఎప్పుడు పడుతుందనేది ఆసక్తిగా మారింది. అయితే గత నాలుగు సంవత్సరాలుగా జిల్లాలో నమోదైన ‘పోక్స్‌’ కేసులపై విచారణ జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించేది లేదంటున్నారు జిల్లా పోలీస్‌ అధికారులు. 

  • గతేడాది మేలో సిద్దిపేటకు చెందిన బాలికపై అదే కాలనీలో ఉంటున్న పశువుల కాపరి కన్నెసి దారుణానికి ఒడిగట్టాడు. బాలక వయసుకు ఆ ప్రబుద్దుడి వయసుకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అతడికి తాత వయసు ఉంటుంది. బాలిక బంధువులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రిమాండ్‌కు పంపారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. 
  •  ఈ ఏడాది మేలో జగదేవ్‌ఫూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలకకు ఆటోడ్రైవర్‌ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వశపర్చుకున్నాడు. నమ్మిన బాలిక ఆ యువకుడితో కలిసి నిర్మాణుష్య ప్రదేశానికి వచ్చింది. అప్పటికే ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం స్నేహితులు సిద్ధంగా ఉండటంతో ఐదుగురు యువకులు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిని రోడ్డుమీదనే వదిలేసి వెళ్లారు. అటుగా వచ్చిన వారు బాలికను చూసి ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఐదుగురిపై కేసు నమోదు కాగా ఇంకా కేసు విచారణలోనే ఉంది. 
  • ఇలా జిల్లాలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలా గడిచిన నాలుగు సంవత్సరాల్లో పోలీసు లెక్కల ప్రకారం 201 పోక్స్‌ కేసులు నమోదు కావడం విచారకరం. అయితే ఈ కేసుల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా విచారణ పూర్తి కాలేదు. అన్ని కేసులు విచారణలో ఉన్నాయి. అయితే ఇందులో 30 కేసులు మాత్రం డీఎన్‌ఏ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలు నిర్వహించగా. వాటికి సంబంధించిన విచారణకు ఈ నివేదికలే కీలకంగా మారాయి. 

నమ్మిన వారే మోసగాళ్లు.. 
జిల్లాలో గత నాలుగు సంవత్సరాలుగా నమోదైన బాలికల లైంగిక వేధింపుల కేసుల్లో అత్యధికంగా తెలిసిన వారి ద్వారనే జరగడం గమనార్హం. కుటంబ సభ్యులు వరుస వాయిలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. అదే విధంగా ఒకే పాఠశాల, కళాశాలో చదివిన వారు, ఒకే కాలనీకి చెందిన వారు కూడా ఉన్నారు. అదే విధంగా తెలిసీ తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణకు లోనై ప్రియుడు చెప్పే మాయ మాటలకు నమ్మి మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఏది ఏమైనా పోక్స్‌ కేసుల్లో అత్యధిక శాతం నమ్మినవారు, తెలిసిన వారు ఉండటం శోచనీయం. అదే విధంగా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం, బాలికల వివాహాలకు ఇబ్బంది అవుతుందని పలు సంఘటనలు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నవి కూడా ఉన్నాయి.

కోర్టు తీర్పు సరైనదే.. 
అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ తీర్పు ఉక్కుపాదంలా పనిచేస్తుంది. సంఘటనపై త్వరగా స్పందించిన కోర్టు తీర్పునివ్వడం హర్షనీయం. ఈ తీర్పు నిందితుల్లో భయం కలిగించింది. పోలీసులు సంఘటనపై వేగంగా విచారణ పూర్తి చేసి కోర్టుకు అప్పగించడం జరిగింది. మరోసారి అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ప్రజల్లో చైతన్యం రావాలి.  
–చందనాదీప్తి, ఎస్పీ, మెదక్‌ జిల్లా

తప్పుచేసిన వారిని వదిలి పెట్టం..
తప్పుచేసిన వారిని శిక్షించేందుకే పోలీస్‌ వ్యవస్థ ఉంది. బాలికలపై అత్యాచారాలు వంటి విషయంలో మరీ కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకోసమే ఇటువంటి కేసులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి కేషీట్‌ వేస్తున్నాం. వీలైనంత త్వర గా కేసును చేధిస్తే పోలీస్‌ వ్యవస్థపై ప్రజల కు నమ్మకం కలుగుతుంది. ఆదిశలోనే జిల్లాలోని కేసుల విచారణ వేగవంతం చేశాం.
– జోయల్‌ డేవీస్, సీపీ సిద్దిపేట 

>
మరిన్ని వార్తలు