సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ప్రమాదం జరిగిన వెంటనే ఆ చిన్నారి ఆత్మస్థైర్యం కోల్పోకుండా సమయ స్ఫూర్తితో వ్యవహరించి రెండు ప్రాణాలు కాపాడింది. వివరాలు.. మోర్తాడ్ నుంచి ఆర్మూర్కు వెళ్తుండగా శుక్రవారం రాత్రి వేల్పూర్ మండలం కుకునూర్ క్రాస్రోడ్డు వద్ద కారు చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కారులో మోర్తాడ్కు చెందిన శ్రీనివాస్, ఆయన భార్య లావణ్య, కూతురు హర్షిత(11), అతడి స్నేహితుడు కృష్ణతేజ ఉన్నారు. ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడిక్కడే మరణించారు. కాగా లావణ్య, కృష్ణతేజ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. హర్షితపైకి ఆమె తల్లి లావణ్య ఒదిగిపోయారు. (మోదీ చిన్ననాటి ఫొటోలు, ఆసక్తికర విషయాలతో..)
ఎంత పిలిచినా కారులో ఎవరు పలుకకపోవడంతో హర్షిత కారు అద్దం పగులగొట్టి బయట వెళ్తున్న వారిని సాయం కోసం అడిగింది. వాహనాల్లో వెళ్తున్న వారు ఎవరు పట్టించుకోలేదు. చివరకు నడుచుకుంటూ వేరే రాష్ట్రానికి వెళ్తున్న ఓ వ్యక్తి స్పందించి ఆ చిన్నారిని బయటకు తీశాడు. వెంటనే హర్షిత తన తండ్రి ఫోన్ నుంచి 108కు, తన తండ్రి స్నేహితుడు దామోదర్కి ఫోన్ చేసింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి లావణ్య, కృష్ణతేజకు ప్రథమ చికిత్స చేసి, ఆస్పత్రికి తరలించారు. ఇదే వాహనంలో హర్షిత కూడా వెళ్లింది. అంతకు ముందే దామోదర్కు సంఘటన గురించి హర్షిత వివరించడంతో వారు మోర్తాడ్ నుంచి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం లావణ్య, కృష్ణతేజ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. (ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత)