లేత నెత్తుటి మరకలే.. ఆ గాజుల తళుకులు

1 Feb, 2015 01:47 IST|Sakshi
లేత నెత్తుటి మరకలే.. ఆ గాజుల తళుకులు

హైదరాబాద్ పాతబస్తీలో చితికిపోతున్న బాల్యం


  సాక్షి, హైదరాబాద్: అందమైన హరివిల్లుల్లా మెరిసిపోయే లక్క గాజుల్లో మసకబారుతున్న పసితనముంది.. తల్లి పొత్తిళ్లలో సేదదీరిన జ్ఞాపకాల తడి ఆరకుండానే పాతబస్తీ గాజుల బట్టీల్లోకి చేరిన చిన్నారుల నెత్తురు స్వేదమై ప్రవహి స్తోంది.. కళ్లు జిగేల్‌మనిపించే మెరుపుల వెనుక వేలాది మంది చిన్నారుల ఆక్రందన దాగుంది.. పలక, బలపం పట్టుకొని బడికి వెళ్లాల్సిన చిట్టి చేతులు మాఫియా కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. కన్నవాళ్లకు, పుట్టిపెరిగిన ఊళ్లకు దూరంగా బానిసల్లా కాలం వెళ్లదీస్తూ ప్రమాదకర రసాయనాలు, యాసిడ్‌లలో తడిసి ముద్దవుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఇరుకుగల్లీల్లో గాజుల బట్టీలు, ఇతర కుటీర పరిశ్రమల్లో సమిధలవుతున్న బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన చిన్నారుల వ్యథాభరిత జీవన చిత్రమిది. ఇటీవల పోలీసులు తనిఖీలు చేసి భారీ సంఖ్యలో పిల్లలకు విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిన్నారుల దయనీయమైన జీవన స్థితిగతులపై ‘సాక్షి’ ప్రత్యేక క థనం..
 
 ముక్కుపచ్చలారని వయస్సులోనే..: మహ్మద్ కుర్బాన్, మహ్మద్ షాబాద్, రాజా, రోహిత్ కుమార్, మహ్మద్ షాహిల్, లాల్‌దీప్, శంకర్, మహ్మద్ ఇమ్రోజ్, రంజిత్, పరమేష్, రోహిత్ , కర్మ... ఇలా పేరేదైనా వారంతా ఐదు నుంచి పదిహేనేళ్లలోపు చిన్నారులే. బడికి వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన దశలోనో.. నాలుగు, ఐదు తరగతుల్లో ఉన్నప్పుడో గాజుల బట్టీల వద్దకు వచ్చిపడిన వాళ్లే. పోలీసులు విముక్తి కల్పించిన సుమారు 400 మంది బాల కార్మికుల్లో 90 శాతానికి పైగా బీహార్‌లోని అత్యంత వెనుకబడిన జిల్లాలైన గయ, పట్నా, నలంద, జూనాగఢ్, బేలా, జాహనుబాద్, నవాడ, పదాసియా, ధమోల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారే. అందులోనూ నిరుపేద దళితులు, మైనారిటీల పిల్లలే ఎక్కువగా ఉన్నారు.
 
 సొంత ఊళ్లల్లో సేఠ్‌ల దగ్గర చేసిన అప్పులు తీర్చడం కోసం తమ పిల్లలను పనికోసం హైదరాబాద్‌కు పంపించిన (మాఫియాకు విక్రయించిన) తల్లిదండ్రులు కొందరైతే... కుటుంబాన్ని పట్టించుకోకుండా బలాదూర్‌గా తిరిగే భర్తల దురాగతాలను భరిస్తూ పిల్లలను ఆకలిదప్పులతో చంపలేక హైదరాబాద్ గాజుల బట్టీలకు పంపించిన తల్లులు మరి కొందరు. పదేళ్ల మహ్మద్ దావీజ్ సొంత ఊరు ధమోల్. రెండేళ్ల కింద హైదరాబాద్‌కు వచ్చాడు. తండ్రి సికిందర్ మటన్ షాపులో పని చేస్తాడు. తల్లి షహనాజ్ ఇంటి దగ్గరే ఉంటుంది. తనతో పాటు ఆరుగురు అక్కచెల్లెళ్లు. అక్క పర్వీజ్‌కు పెళ్లయింది. మిగతా వాళ్లంతా తన కంటే చిన్నవాళ్లు. ‘‘మా నాన్న బాగా తాగుతాడు. ఇంట్లో ఒక్క పైసా కూడా ఇవ్వడు. పైగా మమ్మల్ని బాగా కొడతాడు. మరో గత్యంతరం లేక అమ్మ నన్ను ఇక్కడికి పంపించింది. ఎన్ని డబ్బులు తీసుకొందో తెలియదు. కానీ ఆజాద్ సేఠ్‌తో వెళ్లిపొమ్మంటే వచ్చాను’’ అని చెప్పాడు దావీజ్. ఒక్క దావీజ్ మాత్రమే కాదు.. ఇలా వచ్చిన పిల్లలు వేలాది మంది.
 అంతా పకడ్బందీగా...
 
 పాతబస్తీలో వారం, పది రోజులుగా పోలీసులు చేపట్టిన గాలింపుల్లో వందల మంది పిల్లలను గుర్తించారు. కానీ హైదరాబాద్‌లోని పాతబస్తీలోనే కాదు బీహార్‌లోని వెనుకబడిన జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఈ ‘బానిస వ్యాపారం’ సాగుతోంది. ఏటా వేలాది మంది చిన్నారుల విక్రయం జరుగుతూనే ఉంది. హైదరాబాద్‌లోని గాజుల బట్టీల ఏజెంట్లతో సంబంధాలున్న కొందరు వ్యాపారులు (సేఠ్‌లు)... పేద, దళిత, మైనారిటీ కుటుంబాలకు గాలం వేస్తారు. పేదరికం కారణంగా పిల్లలను పోషించలేని దుస్థితిలో ఉన్న తల్లిదండ్రులకు ఎంతో కొంత ముట్టజెప్పి వారి పిల్లలను హైదరాబాద్ గాజు బట్టీల ఏజెంట్లకు అప్పగిస్తారు. పిల్లల వయసును బట్టి రూ. 5 వేల నుంచి రూ. 20 వేల వరకూ ఇస్తారు. రైళ్లు, బస్సులు వంటి ప్రజా రవాణా వాహనాల్లో వస్తే పోలీసులు గుర్తించే అవకాశం ఉండడంతో ఏజెంట్లు ఆ పిల్లలను తమ సొంత వాహనాల్లోనే హైదరాబాద్‌కు తీసుకువస్తారు. ఇలా ఆ పిల్లలంతా పాతబస్తీలోని భవానీనగర్, గాజులబండ, కంచన్‌బాగ్, ఫలక్‌నుమా, హుస్సేనీఆలం, తలాబ్‌కట్ట, చార్మినార్, ఛత్రినాక తదితర ప్రాంతాల్లోని ఇరుకైన గల్లీల్లో, అంతకంటే ఇరుకైన గదుల్లో ఉండే గాజుల బట్టీలకు చేరుతారు. గాజులతోపాటు, ప్లాస్టిక్ వస్తువులు, పతంగుల తయారీ, చీరల డిజైనింగ్ వంటి పనులకు వారిని ఉపయోగిస్తారు.
 
 చిత్రహింసలు.. రోగాలు..
 
 వచ్చిన పిల్లలను వెంటనే పనిలో పెట్టుకోకుండా రెండు, మూడు రోజుల పాటు సరదాగా గడపనిస్తారు. తర్వాత వారం పాటు గాజుల తయారీలో శిక్షణ ఇస్తారు. అయితే వేడి కొలిమిలో లక్కను కరిగించి తయారుచేసే ఈ గాజులకు రంగు రంగుల రాళ్లు అతికించాలి. ఈ పనిలో రకరకాల రసాయనాలతో పాటు, యాసిడ్‌ను కూడా  ఉపయోగిస్తారు. వాటి కారణంగా చాలా మంది పిల్లలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. చర్మవ్యాధులతో పాటు తరచుగా జ్వరం, తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి వంటి అనారోగ్యాలకు గురవుతారు. ఇటీవల పోలీసులు రక్షించిన పిల్లల్లో 14 మంది ఇలాగే జ్వరంతో బాధపడుతూ శనివారం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరారు.  ఇక పిల్లలంతా ఒక్కొక్కరు రోజుకు కనీసం వంద గాజులు తయారు చేయాలి. 10 గాజులు తగ్గినా... యజమానుల చేతుల్లో చిత్రహింసలు తప్పవు. మరోవైపు ఈ పిల్లల మీద ప్రతి క్షణం నిఘా ఉంటుంది. ఇందుకు కొన్ని చోట్ల సీసీ కెమెరాలను కూడా వాడుతుండడం గమనార్హం. చిన్నారి మిరాజ్ మాటల్లో చెప్పాలంటే.. ‘‘తెల్లారంగానే పనికి పోతాం. ఉదయం 11 గంటలకు కొంచెం బూందీ ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రెండు రొట్టెలు, కొద్దిగా కూర. మళ్లీ రాత్రి 10 గంటలకు అన్నం పెడతారు. రోజూ ఇంతే. ఆదివారం మాత్రం ఖర్చు కోసం 20 రూపాయలు ఇస్తారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు బట్టీల దగ్గర ఉండాల్సిందే. రోజూ వంద గాజులు తయారుచేయాలి. అంతకంటే తగ్గితే ఇక ఆ రోజు మూడినట్లే..’.
 
 వ్యాపారులకు మాత్రం కోట్లు..
 
 పాతబస్తీ ఇరుకు గల్లీల్లోని బట్టీల్లో గాజులు తయారుచేసే చిన్నారుల వెట్టి చాకిరీ వ్యాపారులకు కోట్లు కురిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకొనే లాడ్‌బజార్ గాజుల అమ్మకాలతో కోట్లు పోగేసుకొనేది మాత్రం వ్యాపారులు, బట్టీ యజమానులు, ఏజెంట్లు, బీహార్ సేఠ్‌లు. రెక్కాడితేగానీ డొక్కాడే మార్గం లేక కన్నపిల్లలను అమ్ముకున్న తల్లిదండ్రులది మళ్లీ అదే దుస్థితి.
 
 
 1,397 మంది బాలలకు విముక్తి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) ఒక్క జనవరిలోనే ‘ఆపరేషన్ స్మైల్’ పేరిట 1,397 మంది బాలలను కాపాడింది. వీరిలో 354 మంది బాలికలు కూడా ఉన్నారు. 660 మందిని తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించారు. మిగతావారిని రెస్క్యు హోంలకు పంపించారు. హైదరాబాద్‌లో 239, సైబరాబాద్ పరిధిలో 124, ఆదిలాబాద్ జిల్లాలో 127, కరీంనగర్‌లో 265, ఖమ్మంలో 140, మహబూబ్‌నగర్‌లో 24, మెదక్‌లో 20, నల్లగొండలో 234, నిజామాబాద్‌లో 67, రంగారెడ్డిలో 5, వరంగల్‌లో 131 మంది బాలలను కాపాడినట్టు సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ తెలిపారు. తొలుత యూపీలోని గాజియాబాద్ పోలీసులు కూడా ‘ఆపరేషన్ స్మైల్’ పేరుతో 30 రోజుల్లో 227 మంది బాలలను రక్షించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్న కేంద్ర హోం శాఖ సూచన మేరకు రాష్ట్ర సీఐడీ విభాగం జనవరి ఆద్యంతం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో దాడులు చేసింది. స్వచ్ఛంద సంస్థలు, బాలల సంరక్షణ కమిటీల వంటివాటి సహకారంతో పెద్ద సంఖ్యలో బాలలను కాపాడింది.
 
 చదువు కోవాలనుంది: మహ్మద్ సాదీ
 
 ‘మాది బీహార్. నెల రోజుల క్రితం మా అమ్మవాళ్లకు డబ్బులిచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. చీరల పరిశ్రమలో పనిచేయిస్తున్నారు. రోజు 15 గంటలు పనిచేయాలి. చలికి రాత్రి పూట నిద్ర కూడా రావడం లేదు. కొద్దిసేపు కూర్చున్నా కొడుతున్నారు. ఎప్పుడూ కార్కానాలోనే ఉండాలి. నాకు ఇంటికి పోయి చదువుకోవాలనుంది.’
 
 నిద్ర కరువు: గుడ్డూ
 
 ‘ఏడాది కింద బీహార్ నుంచి వచ్చాను. చీరల కార్కానాలో పనిచేస్తున్నా. రోజుకు గంటల తరబడి పనిచేయిస్తున్నారు. బయటికి వెళ్లనీయకుండా కార్కానాలోనే ఉంచేస్తారు. పడుకునేందుకు సరిగా లేక నిద్ర కూడా పోలేకపోతున్నాం.’
 
 దాడులు చేస్తూనే ఉన్నాం..
 ‘‘పాతబస్తీలో ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాం. ఇటీవలే చార్మినార్, లాడ్‌బజార్ ప్రాంతంలో దాడులు చేసి 70 మంది చిన్నారులను జువైనల్ హోమ్‌కు తరలించాం. వారి తల్లిదండ్రులను పిలిపించి అవగాహన కల్పించాం. పాతబస్తీలో బాల కార్మికులు కాస్త ఎక్కువగానే ఉన్నారు. దాడులలో ప్రతి సారి 20 మంది వరకు పట్టుబడుతున్నారు..’’
 - నాగరాజు,
 కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్

మరిన్ని వార్తలు