నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చిన్నారుల తారుమారు

30 Nov, 2017 10:37 IST|Sakshi
సిబ్బందితో తల్లిదండ్రుల వాగ్వాదం

తల్లిదండ్రుల ఆందోళన..

డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తాం

ఈఎస్‌ఐ ఎంఎస్‌ డాక్టర్‌ పద్మజ

నాచారం:నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బుధవారం ఉదయం జన్మించిన చిన్నారులు తారుమారు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెలితే... బుధవారం ఉదయం ఏఎస్‌రావునగర్‌కు చెందిన శివకుమార్, అఖిల దంపతులు, ఎల్‌బీనగర్‌కు చెందిన మహే ష్,  మనీషారాణి దంపతులు డెలివరీ నిమిత్తం నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రి వచ్చారు. అఖిల, మనీషారానిలకు  ఆపరేషన్‌ చేయగా ఇద్దరు మగ శిశువులు జన్మించినట్లు కిందిస్థాయి సిబ్బంది తల్లిదండ్రులకు తెలిపారు. ఇద్దరు చిన్నారులకు పుట్టగానే ట్యాగ్‌లు వేసి అఖిలకు బిడ్డను చూపించారు. అంతలో మరొకరు వచ్చి ఈ శిశువు మీ శిశువు కాదు పొరపాటు జరిగిందంటూ మరో శిశువును అప్పగించారు.

దీంతో వారి కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. మొదట చూపిన శిశువే తమ శిశువని వాగ్వాదానికి దిగడంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. ఆస్పత్రి వైద్యులు, ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని అంగీకరిస్తూ ఎవరి శిశువును వారికి అప్పగిస్తామని చెప్పి చిన్నారులు, వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రుల, చిన్నారుల రక్త పరీక్షలు సరిపోయాయని ఎవరి శిశువును వారికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. అయినా తల్లిదండ్రులకు చిన్నారుల విషయంలో అనుమానం ఉండటంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని పట్టుబట్టారు. ఇందుకు వైద్యులు అంగీకరించడంతో వారు శాంతించారు.

డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తాం
కింది స్థాయి సిబ్బంది (ఆయాలు) నిర్లక్ష్యం కారణంగా శిశువుల మార్పిడి జరిగింది. శిశువుల చేతికి ఉన్న ట్యాగ్‌ల ఆధారంగా ఎవరి శిశువులను వారికి అప్పగించాం. అయితే ఈ విషయం లో తల్లిదండ్రులకు అనుమానం వ్యక్తం చేయడంతో రక్త పరీక్షలు నిర్వహించగా, చిన్నారులు వారి తల్లిదండ్రులు నమూనాలు సరిపోయాయి. అయినా వారు అంగీకరించ నందున గురువారం సీసీఎంబీలో చిన్నారులకు డీఎన్‌ఏ పరీక్ష లు నిర్వహించి ఎవరి శిశువులను వారికి అప్పగిస్తాం. ప్రస్తుతం శిశువులు, తల్లులు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు.  – ఈఎస్‌ఐ ఎంఎస్‌ డాక్టర్‌ పద్మజ

మరిన్ని వార్తలు