చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు రండి

21 Jan, 2019 03:15 IST|Sakshi

సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 

నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రాలిచ్చిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, హర్ష 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల 12 నుంచి ప్రారంభం కానున్న నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ఆయనను కలిసిన చిరుమర్తి చెర్వుగట్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం చెర్వుగట్టుకు ఒకటే రోడ్డు ఉందని, వచ్చి వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉంటే బాగుంటుందని, అదే విధంగా గుట్ట కింద పార్కింగ్‌ ప్లేస్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, సత్రాలు నిర్మించాలని కోరారు.

గట్టుపై ఉన్న భూమిని చదును చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, నార్కెట్‌పల్లి నుంచి చెర్వుగట్టు మీదకు వచ్చే సర్వీసు రోడ్డును పూర్తి చేయాలని ఆయన కోరారు. అదే విధంగా నకిరేకల్‌ పట్టణం నుంచి నల్లగొండకు వెళ్లే సింగిల్‌ రోడ్డు చాలా ప్రమాదకరంగా మారిందని, దానికి మరమ్మతులు చేపట్టాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డిలు తమ నియోజకవర్గ సమస్యలపై వేర్వేరుగా సీఎంకు వినతిపత్రాలు అందజేశారు.   

మరిన్ని వార్తలు