'సత్యం' టిక్కెట్ వెనక పవనిజం

11 Apr, 2014 08:53 IST|Sakshi
'సత్యం' టిక్కెట్ వెనక పవనిజం

జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ జోక్యంతో చొప్పదండి నియోజకవర్గ టీడీపీలో సమీకరణాలు ఒక్కసారిగా మారా యి. ఆయనకు సన్నిహితుడిగా పేరున్న మేడిపల్లి సత్యానికి టీడీపీ టికెట్ ఖరారు చేయడంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇంతకాలం పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న మ్యాక లక్ష్మణ్‌కు అన్యాయం జరిగిందని ఆయన వర్గీయులు అంటున్నారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌లో చేరడంతో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డ లక్ష్మణ్‌కు చొప్పదండి టికెట్ వస్తుందని భావించారు.
 
 లక్ష్మణ్ కూడా తనకే టికెట్ వస్తుందని బుధవారం అట్టహాసంగా నామినేషన్ వేసేందుకు సమాయత్తమయ్యారు. పీఆర్పీలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చి ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిన మేడిపల్లి సత్యానికి అనూహ్యంగా టీడీపీ టికెట్ ఖరారైనట్లు తెలియడంతో లక్ష్మణ్ అవాక్కయ్యారు. సత్యంకు టికెట్ ఖరారైన విషయం టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణకే తెలియకపోవడం విశేషం. ఊహించని పరిణామంతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. అయితే తన అనుచరుడికి టికెట్ ఇప్పటించడంలో పవన్ మార్క్ పనిచేసిందని సమాచారం.

మరిన్ని వార్తలు