సీఐ సస్పెన్షన్‌

16 Mar, 2018 08:02 IST|Sakshi
సీఐ గజ్జి కృష్ణ

గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ గజ్జి కృష్ణను సస్పెండ్‌ చేస్తూ కరీంనగర్‌ రేంజీ డీఐజీ ప్రమోద్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గోదావరిఖని బాపూజీ నగర్‌లో ఫిబ్రవరి 16న తూడి స్వాతి ఆత్మహత్యకు ఆయనే కారణమని తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వివరాలు.. తూడి స్వాతి నాలుగేళ్ల కూతురుపై అదే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తదనంతరం బాలుడు, ఆయన తండ్రి బెయిల్‌పై వచ్చి స్వాతితో పాటు కుటుంబ సభ్యులను తిట్టడం.. వేధించడం చేశారు.

దీంతో స్వాతి న్యాయం చేయాలని వన్‌టౌన్‌ సీఐ గజ్జి కృష్ణను కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మానసికంగా వేదనకు గురైన ఆమె గతనెలలో ఆత్మహత్య చేసుకున్నారు. స్పందించిన సీపీ దుగ్గల్‌ వెంటనే సీఐ కృష్ణను కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విచారణ అనంతరం ఆయనను సస్పెండ్‌ చేస్తూ డీఐజీ ప్రమోద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. అయితే సీఐని కమిషనరేట్‌కు అటాచ్‌ చేసినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియకుండా విధులకు గైర్హాజరుకావడం.. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం కూడా సస్పెండ్‌కు కారణాలుగా తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు