సాక్షి, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లూడో గేమ్ ఆడి విద్యార్థులు ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. వివరాలు.. నిజామాబాద్లోని హమాల్ వాడి, గౌతమ్ నగర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు లూడో గేమ్కు బానిసలుగా మారారు. ప్రతిరోజు బంగారు మైసమ్మ గుడి వద్ద లూడో గేమ్ ఆడేవారు. ఈ క్రమంలో మంగళవారం కూడా ఎప్పటిలాగానే లూడో గేమ్ ఆడుతూ కూర్చున్నారు. ఈ నేపథ్యంలో డబ్బుల విషయంలో ఘర్షణ ప్రారంభమైంది. కేవలం రూ.80 కోసం పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఓంకార్ ఆవేశంలో ఎనిమిదో తరగతి విద్యార్థుడిని కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్కు తరలించారు.