అన్నదాతలందరికీ రూ. 5 లక్షల జీవిత బీమా
ఆగస్టు 15న పథకం ప్రారంభం..
రైతులకు బీమా సర్టిఫికెట్లు
రైతుల పేరిట ఏటా ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం
18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులందరూ అర్హులే
విధివిధానాలను వెల్లడించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు. రైతులకు ఎంత భూమి ఉన్నా, వారు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, ఎంత వ్యయమైనా ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకానికి కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయిస్తామన్నారు. ఏటా ఆగస్టు 1న ప్రీమియం చెల్లిస్తామని చెప్పారు.
విశ్వసనీయత, విస్తృత యంత్రాంగమున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ద్వారా బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. సాధా రణ మరణమైనా, ప్రమాదవశాత్తూ చనిపోయినా రైతు ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా రూ.5 లక్షల బీమా పరిహారం చెల్లించేలా ఈ పథకం ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం ప్రమాద బీమా అయితే.. ప్రభుత్వంపై వ్యయ భారం కూడా తక్కువయ్యేదని, కానీ ఎంత ఖర్చయినా మరణించిన ప్రతీ రైతు కుటుంబాన్ని ఆదుకోవడాన్ని బాధ్యతగా భావించి బీమా చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రైతుల జీవిత బీమా పథకం రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులు, ఎల్ఐసీ ప్రతినిధులతో మాట్లాడి విధి విధానాలు ఖరారు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో బీమా చేస్తున్నందున ఎల్ఐసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కోరారు. ‘‘తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే 93 శాతం మంది ఉన్నారు. ఒక్క ఎకరంలోపు ఉన్న వారు 18 లక్షల మంది ఉన్నారు. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదేని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఉంటే ఆ కుటుంబానికి ఆసరా ఉంటుంది. కేవలం ప్రమాద బీమా వర్తింపచేయడం వల్ల ప్రభుత్వానికి భారం తక్కువగా ఉన్నప్పటికీ, రైతులకు పెద్దగా లాభం ఉండదు.
కాబట్టి వ్యయం ఎక్కువైనా సరే సాధారణ మరణాలకు కూడా వర్తించే విధంగా జీవిత బీమా చేయాలని నిర్ణయించాం’’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ వినోద్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, ఎల్ఐసీ రీజినల్ మేనేజర్ ఆర్.చందర్, డీఎం బీఎస్ నర్సింహ, డీఎం సుబ్రహ్మణ్యం, బీఎం జి.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విధివిధానాలివే..
దేశ చరిత్రలో ఇది రికార్డు: ఎల్ఐసీ
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతులకు జీవిత బీమా సదుపాయం దేశ చరిత్రలో, బీమా సంస్థల చరిత్రలో సరికొత్త రికార్డుగా ఎల్ఐసీ ప్రకటించింది. ‘‘గతంలో కూడా ఇలాంటి గ్రూపు ఇన్సూరెన్సులున్నాయి. తక్కువ మంది సభ్యులు.. లక్ష నుంచి రెండు లక్షల బీమా ఉండేది. ప్రీమియం సొమ్ము తక్కువవుతుందనే ఉద్దేశంతో ప్రమాద బీమా మాత్రమే చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంత వ్యయమైనా సరే, రైతులందరికీ ప్రయోజనం ఉండాలని భావించింది. ఎక్కువ ప్రీమియం అయినా సరే.. ప్రమాద బీమా కాకుండా జీవిత బీమా చేయాలని నిర్ణయించింది. రైతులందరికీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల బీమా చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇన్ని లక్షల మందిని సభ్యులుగా గ్రూపు ఇన్సూరెన్సు చేయడం కూడా దేశ చరిత్రలో, ఇన్సూరెన్సు కంపెనీల చరిత్రలో ఎన్నడూ లేదు’’అని సీఎంతో సమీక్ష అనంతరం ఎల్ఐసీ రీజనల్ మేనేజర్ ఆర్.చందర్, డీఎంలు బీఎస్ నర్సింహ, సుబ్రహ్మణ్యం అన్నారు.