అందరినీ ఆదరిస్తాం

21 Dec, 2019 01:18 IST|Sakshi
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో బిషప్‌ తుమ్మ బాలతో కలసి కేక్‌ కట్‌ చేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో ఏకే ఖాన్, కొప్పుల ఈశ్వర్, కేకే తదితరులు

క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎవరికి ఏరకమైన అభ్యంతరాలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం నూటికి నూరు శాతం సెక్యులర్‌ రాష్ట్రంగానే ఉంటుందని, ఇక్కడ అన్ని మతాలకు సమాన గౌరవం లభిస్తుందని, అందరినీ ఆదరించే రాష్ట్రమని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భారత్‌ గొప్ప దేశ మని ఇక్కడ జరుపుకున్నన్ని పండుగలు ప్రపంచంలో మరెక్కడా జరుపుకోరన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇస్లామిక్‌ దేశాలలో రంజాన్, బక్రీద్‌ పండుగలు, ఇతర దేశాలలో నాలుగైదు పండుగలు జరుపుకుంటారని, కానీ భారత్‌లో జరుపుకు నేవి చాలా ఉన్నాయన్నారు. ‘ఉత్సవాలు జరుపుకునే గుణం, సహనంతోపాటు మనుషులను ప్రేమించే తత్వం ఉంటే ఇది సాధ్యపడుతుంది. దానికి నా తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం.

క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితరులు

ఇదే ఎల్‌బీ స్టేడియంలో ఇఫ్తార్, బతుకమ్మ, ఇప్పుడు క్రిస్మస్‌ పండుగలు జరుపుకుంటున్నాము’అని సీఎం అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అందరితో పాటు క్రైస్తవులకు అందిస్తున్నామని, ఎవరికైనా పథకాలు అందకపోతే మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి చెప్పాలని సూచించారు. త్వరలో క్రైస్త్త్తవ మత నాయకులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి 2 పంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 70 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని సీఎం ప్రకటించారు. ఉత్సవాల్లో బిషప్‌ షపర్డ్‌ రెవరెండ్‌ గొల్లపల్లి జాన్, బిషప్‌ తుమ్మ బాల, మంత్రులు శ్రీనివాసగౌడ్, శ్రీనివాసయాదవ్, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు