నేడు మెదక్‌కు సీఎం కేసీఆర్

17 Dec, 2014 00:22 IST|Sakshi
నేడు మెదక్‌కు సీఎం కేసీఆర్

కొల్చారం/పాపన్నపేట : సీఎం కేసీఆర్ నేడు మెదక్‌కు రానున్నారు. కొల్చారం, పాపన్నపేట మండలాల మధ్య గల ఘనపురం ప్రాజెక్ట్‌ను సందర్శించి ఆనకట్ట ఎత్తు పెంపు అంశంపై స్థానిక అధికారులతో సమీక్షించడంతో పాటు స్థానిక అధికారులతో కలిసి ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, ఎస్‌ఈ రాధాకృష్ణలతో కలిసి ఘనపురం ప్రాజెక్ట్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరి శీలించారు.

అనంతరం కలెక్టర్  మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనపురం ఆనకట్ట వద్దకు హెలీకాఫ్టర్‌లో చేరుకుంటారని తెలిపారు. అనంతరం ఘనపురం ప్రాజెక్ట్ చుట్టూ అధికారులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఆనకట్ట ఎత్తు పెంచితే పెరిగే నిల్వ నీటి సామర్థ్యం వివరాలు పరిశీలిస్తారన్నారు. ఇందుకనుగుణంగా ఇరిగేషన్ అధికారులు ఆనకట్టపై, ప్రాజెక్ట్ చుట్టూరా జెండాలు ఏర్పాటు చేసి సీఎంకు వివరిస్తారన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాలినడకన ఆనకట్ట చుట్టూ తిరిగి వివరాలు తెలుసుకుంటారని వెళ్లడించారు. అనంతరం మెదక్ పట్టణానికి వచ్చి ఇండోర్ స్టేడియం వద్ద మెదక్  నియోజకవర్గ అభివృద్ధిపై అధికారుల, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పం చ్‌లు, కో ఆపరేటివ్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్విహ స్తారని కలెక్టర్ తెలిపారు.

ఎంఎన్ కెనాల్ పక్కన హెలీప్యాడ్
కొల్చారం మండలం చిన్నఘనపురం శివారులో గల మహబూబ్ నహర్ కెనాల్ దిగువన, మెకానికల్ బ్రిడ్జి పక్కన సీఎం కేసీఆర్ హెలీకాఫ్టర్ దిగేందుకు హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్. వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, కొల్చారం తహశీల్దార్ నిర్మల, పోతం శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ యాదాగౌడ్, ఏడుపాయల డెరైక్టర్ యాదయ్య, లక్ష్మిపతి, గౌరిశంకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సర్వే అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్ట్ పక్కనే భోజనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఏర్పాట్లపై జేసీ శరత్ సమీక్ష
సంగారెడ్డి అర్బన్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మెదక్ పర్యటన ఏర్పాట్లపై జేసీ శరత్ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ శరత్ జిల్లా అధికారులతో సమీక్ష  నిర్వహించారు.  సీఎం సమీక్ష సమావేశానికి అధికారులంతా తగు నివేదికలతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో డీఆర్‌ఓ దయానంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు