-
అసెంబ్లీ ఎన్నికలపై నిర్ణయాధికారాన్ని కేసీఆర్కే అప్పగించిన మంత్రులు
రేపు స్పష్టత ఇస్తానన్న టీఆర్ఎస్ అధినేత
ప్రగతి భవన్లో ఏడు గంటలపాటు సమావేశం
తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ పరిణామాలపైనా చర్చ
పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటిస్తే మంచిదేనా...?
మంత్రుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్
సచివులతోకన్నా ముందే హరీశ్రావుతో ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు అప్పగిస్తూ మంత్రులంతా నిర్ణయించినట్లు తెలిసింది. శాసనసభను రద్దు చేయాలా, వద్దా... చేయాల్సి వస్తే ఎప్పుడు... షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్దామా అనే అంశాలపై ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సంపూర్ణ అధికారాలను కేసీఆర్కే అప్పగిస్తూ మంత్రులంతా ఆమోదించినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీనిపై శుక్రవారం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘంగా, ఏడు గంటలపాటు ప్రగతి భవన్లో బుధవారం సమావేశమయ్యారు. పూర్తిగా ఎన్నికలను కేంద్రంగానే చేసుకుని ఈ సమావేశం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన భేటీ రాత్రి 11 గంటలదాకా సాగింది.
ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయస్థాయి పరిణామాలపై అంచనా, ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశముంది, నాలుగున్నరేళ్లు పూర్తవుతున్న ఈ సమయంలో జిల్లాలవారీగా జరిగిన అభివృద్ధి, టీఆర్ఎస్ పరిస్థితి, పార్టీ అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో చర్చకొచ్చిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షాలతో శుక్రవారం జరగబోయే సమావేశంలో చర్చించి ప్రకటించనున్నారు. ఎన్నికలు ఎప్పుడనే అంశంపైనా ఇదే సమావేశంలో స్పష్టత ఇస్తానని కేసీఆర్ సూచనప్రాయంగా వెల్లడించినట్లుగా తెలిసింది. అయితే శాసనసభ రద్దు అంశంపై జరిగిన చర్చ, వచ్చిన అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయం వంటి వాటి వివరాలను బయటకు వెల్లడించేందుకు మంత్రులు నిరాకరించారు. శాసనసభ రద్దు అంశంపై కేసీఆర్ అభిప్రాయాన్ని మంత్రులెవరూ వెల్లడించడం లేదు. అయితే ఈ సమావేశంలో జరిగిన చర్చలకు సంబంధించి మంత్రులు చెప్పిన వాటి ప్రకారం కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
చేసిందే చెబుదాం...
వచ్చే నెల 2న నిర్వహించబోయే ప్రగతి నివేదన సభ ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అంశాలు, జన సమీకరణకు ఏర్పాట్లు వంటి వాటిపై ఈ సమావేశంలో ఎక్కువసేపు చర్చ జరిగినట్లుగా తెలిసింది. రాష్ట్రస్థాయిలో ప్రజలకు ఈ సభ ద్వారా అందించబోయే సమాచారం ప్రభావం చూపించే విధంగా ఉండటానికి ఏం చేయాలనే విషయమై చర్చించారు. తెలంగాణ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ చేసిన త్యాగం నుంచి తెలంగాణ ఏర్పాటైన నాలుగున్నరేళ్లలోనే జరిగిన అభివృద్ధి దాకా అన్ని అంశాలనూ సవివరంగా ప్రస్తావించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించకుంటే జరిగే నష్టాన్ని కూడా బలంగా తీసుకుపోవాలనే భేటీలో నిర్ణయించారు. తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి, తెలంగాణ ఏర్పాటుకు కల్పించిన అవరోధాలు వంటి వాటిని ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలని నిశ్చయించారు.
దీంతోపాటు కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖరారైన నేపథ్యంలో తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయనే విమర్శలను బలంగా ప్రజల ముందుంచాలని నిర్ణయించారు. కాంగ్రెస్, టీడీపీల కలయిక ద్వారా తెలంగాణకు భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని కూడా ప్రగతి నివేదన సభ ద్వారా వివరించనున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బీమా, రైతు బంధు, 24 గంటల విద్యుత్, కళ్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ, పింఛన్లు, కంటి వెలుగు వంటి కీలక పథకాలను ప్రజల ముందుంచనున్నారు. అలాగే జిల్లాలవారీగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలను చెప్పుకుంటే సరిపోతుందని చెప్పాలని అనుకున్నారు.
అభ్యర్థులను ఖరారు చేద్దామా...
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు లక్ష్యంగా వ్యూహం ఉండాలని, దీనికి అనుగుణంగా అన్ని రకాలుగా సిద్ధమవ్వాలని సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించినట్లు తెలిసింది. కీలకమైన అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలనూ బేరీజు వేసుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గాలవారీగా సమర్థులెవరనే సమచారాన్ని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు కమిటీకి అందజేయాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల వివరాలను, అవసరమైన నియోజకవర్గాల్లో ఇతర ఆశావహుల పేర్లను, బలాబలాలను వివరించేలా నివేదికలు ఉండాలని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు ఒక్కటే లక్ష్యంగా సమాచారం ఉండాలని, ఎక్కడా వ్యక్తిగత అంశాలకు చోటు ఇవ్వొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. వచ్చే నెల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తే రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయని కేసీఆర్ మంత్రులను ఆరా తీసినట్లు సమాచారం. ఎక్కువ మంది మంత్రులు ఈ విషయంలోనే సానుకూలంగానే సమాధానం ఇచ్చారని, ఒకరిద్దరు మాత్రం పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇబ్బందులు రాకుండా చూసి అభ్యర్థులను ప్రకటించాలని కోరినట్లు తెలిసింది.
హరీశ్రావుతో ప్రత్యేక భేటీ....
మంత్రులతో భేటీకి ముందే టి.హరీశ్రావుతో సీఎం కేసీఆర్ సుమారు 20 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశమైనట్లుగా తెలిసింది. మధ్యాహ్న భోజనం ముగిసిన వెంటనే ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ భేటీ ప్రారంభానికి ముందే ప్రగతి భవన్లో పనిచేసే వ్యక్తిగత కార్యదర్శులు, మంత్రుల సహాయకులను అక్కడి నుంచి పంపించారు.