కేంద్రాన్ని నమ్మితే అంతే: కేసీఆర్‌

2 Feb, 2020 02:58 IST|Sakshi

శంకరగిరి మాన్యాలే..

నిధుల్లో భారీ కోత ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష

కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణం

జీఎస్టీ విషయంలో రాష్ట్రాలను మోసం చేస్తున్న కేంద్రం

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలపై సీఎం సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతున్నదని, కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడిందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్‌ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సీనియర్‌ అధికారులతో నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు.

పురోగతికి శరాఘాతం..
రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని, నిధుల్లో భారీ కోత విధించడంతో రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత అందివ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయలేదన్నారు. అన్ని ప్రధాన రంగాలతో పాటు రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించడం రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

జీఎస్టీ అమల్లో కేంద్రానికి చిత్తశుద్ధి లేదు
‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. జీఎస్టీ చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్రం తుంగలో తొక్కింది. చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి రంగాలకు నిధులను తగ్గించారు. ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది’ అని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

నిర్వహణా లోపానికి నిదర్శనం
కేంద్ర పన్నుల్లో తెలంగాణకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాలి. గతేడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణకు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో దీన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంది. కేంద్రం నిధుల్లో కోత విధించడంతో ఇది తారుమారైంది. కేంద్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే కేంద్రానికి వచ్చే పన్నుల నుంచి రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గింది. ప్రతీ సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూఇటూ అయిన సందర్భాలున్నాయి. కానీ, 2019–20 సంవత్సరంలో ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణ లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణపై దారుణంగా పడింది’ అని కేసీఆర్‌ అన్నారు.

పట్టణాభివృద్ధి నిధుల్లో భారీ కోత
బడ్జెట్‌లో పట్టణాల అభివృద్ధి నిధుల కేటాయింపుల్లోనూ 14.3 శాతం కోత విధించడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి 2019–20 బడ్జెట్‌లో రూ.1,037 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో గతంకంటే రూ.148 కోట్లు తగ్గించి, రూ.889 కోట్లే కేటాయించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు కేంద్ర సాయం కోరినా నిధులు కేటాయించలేదు’ అని కేసీఆర్‌ అన్నారు. ‘ఇంకా వ్యవసాయరంగానికి 2019–20లో 3.65% నిధులు కేటాయిస్తే, 2020–21లో 3.39% కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికి ఈసారి 2.13 శాతం నిధులు (గతే డాది 2.24%), గ్రామీణాభివృద్ధికి 3.94% నిధులు (గతేడాది 4.37%), విద్యా రంగానికి 3.22% నిధులు (గతేడాది 3.37%) మాత్రమే కేటాయించారు.

 తెలంగాణకు రెండు రకాలుగా నష్టం
2020–21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో తెలంగాణకు వచ్చే నిధుల్లో 2 రకాలుగా నష్టం వాటిల్లింది. కేంద్రానికి వచ్చే పన్నుల్లో నుంచి రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 నుంచి 41 శాతానికి తగ్గించడంతో మొదటి నష్టం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించడంతో రెండో రకంగా నష్టం వాటిల్లింది. దీంతో రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్లు తగ్గనున్నాయి. ఇంత భారీ స్థాయిలో రాష్ట్రానికి నిధులు తగ్గించడం కచ్చితంగా వివక్షే. 2019–20 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటు లో ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అయితే ఈసారీ అంచనాలు సవరించే నాటికి ఎంత తగ్గిస్తారో తెలియని పరిస్థితి ఉంది’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

>
మరిన్ని వార్తలు