‘కొత్త’ పాత్రలో సీఎస్ రాజీవ్శర్మ!

15 Oct, 2016 02:15 IST|Sakshi
‘కొత్త’ పాత్రలో సీఎస్ రాజీవ్శర్మ!

వచ్చే నెలాఖరున ముగియనున్న పదవీకాలం
సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సేవలను మరి కొంతకాలం వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెలాఖరున సీఎస్ పదవీకాలం ముగియనుంది. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) రెండుసార్లు సీఎస్ పదవీకాలాన్ని పొడిగించింది. ఐఏఎస్ సర్వీసు నిబంధనల ప్రకారం ఈ ఏడాది మే 31న ఆయన పదవీ కాలం ముగిసింది. కానీ మూడు నెలల కాల పరిమితిని పొడిగిస్తూ వరుసగా రెండుసార్లు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

మరో ఆరు నెలల పాటు ఆయననే సీఎస్‌గా కొనసాగించే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. కానీ ఆరు నెలలకు మించి ఐఏఎస్ అధికారుల సర్వీసును పొడిగించిన సందర్భాలు దేశంలో అరుదుగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో సీనియర్ అధికారికి సీఎస్ బాధ్యతలు కట్టబెట్టి.. రాజీవ్‌శర్మ సేవలను మరో తీరుగా వినియోగించుకోవాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనల్లో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను అధిగమించటంతోపాటు వాటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించేందుకు రాజీవ్‌శర్మ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పునర్విభజన సమయంలో కమల్‌నాథన్ కమిటీని నియమించిన తరహాలోనే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నింటికీ మార్గదర్శకంగా ఉండేలా ఈ కమిటీని వేసే అవకాశాలున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం, జయశంకర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహం.. అన్నింటా ఈ కమిటీ క్రియాశీల పాత్ర పోషించనుంది.

మరిన్ని వార్తలు