ఆర్టీసీ మూసివేతే ముగింపు

25 Oct, 2019 02:13 IST|Sakshi

సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరణ

భూగోళం ఉన్నంత వరకు విలీనం అసంభవం

ఆర్టీసీని కాపాడటం వెయ్యి శాతం సాధ్యం కాదు

ఉద్యోగం కావాలనే కార్మికులు దరఖాస్తు చేసుకోవాలి

సాక్షి, హైదరాబాద్‌ : డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆర్టీసీ మూసివేతే పరిష్కారమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నష్టాల బాటలో ఉన్న సంస్థను పునరుద్ధరించడం అసాధ్యమని తేల్చిచెప్పిన కేసీఆర్‌.. సమ్మె విష యంలో యూనియన్లు, రాజకీయ పార్టీల తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ కార్యా లయం తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆర్టీసీ కార్మికులు ఎంచుకున్నది పిచ్చి పంథా. అనవసరమైన అర్థం పర్థంలేని దురహంకార చర్య’ అని సీఎం విమర్శించారు. భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అసంభవమని, సంస్థను కాపాడటం వెయ్యి శాతం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

‘ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అర్థ రహిత, అసంబద్ధ, తెలివితక్కువ నిర్ణయం. పనికి మాలిన, తల మాసిన రాజకీయ పార్టీలు దీనిపై మాట్లాడటం విడ్డూరం. పది మంది కనపడితే చాలు.. జెండా పట్టుకొని కూర్చుంటున్నారు. అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? ప్రతి పక్షా లకు బాధ్యత లేదా? వేతనాలను 67 శాతం పెం చిన తర్వాత కూడా డిమాండ్లు పెట్టడం తమా షానా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీ నామమాత్రంగా మారిందని, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో ఆర్టీసీ లేదని, కమ్యూ నిస్టులు 35 ఏళ్లు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 10 కోట్ల జనాభాకు కేవలం 200 బస్సులు మాత్రమే ఉన్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసిందని గుర్తుచేశారు.

చదవండిసర్కారు దిగొచ్చే వరకు..

యూనియన్‌ ఎన్నికల కోసమే సమ్మె
‘అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానం లేకుండా.. దిక్కుమాలిన, తిన్నదరగక చేస్తున్న సమ్మె ఇది. 40 ఏళ్ల ఆర్టీసీ చరిత్రలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌.. ఇలా ఎవరు అధికారంలో ఉన్నా సమ్మె తప్పదు. మూడేళ్లకోసారి జరిగే యూనియన్‌ ఎన్నికల కోసం జరిగే సమ్మెలు ఇవి. గొంతెమ్మ కోరికలు, అలవికాని డిమాండ్లు పెట్టి నాలుగు ఓట్లు రాబట్టుకొనే చిల్లర మల్లర యూనియన్‌ రాజకీయాలు’ అంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సంస్థ మనుగడ, కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దనే జ్ఞానం ఉన్నవారు ఎవరూ సమ్మె చేయరు. ఆర్టీసీ యూనియన్లు అమాయక కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో నాకేమీ పంచాయితీ లేదు. సమ్మె చట్ట విరుద్ధం. వారిపై ఎస్మా చట్టం కూడా ఉంది. యూనియన్లు చేస్తున్న సమ్మెతో ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు’ అని సీఎం హెచ్చరించారు. ‘ఆర్టీసీ కార్మికులు వారి కాళ్లను వారే నరుక్కుంటున్నారు. ఆర్టీసీ మనుగడ కష్టం.

దాన్ని ఎవరూ కాపాడలేరు. రాష్ట్రంలో 57 ప్రభుత్వ కార్పొరేషన్లు ఉన్నాయి. వారు కూడా మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని అడిగితే ఏం సమాధానం చెప్తాం? సమ్మె విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేయగలదు’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అసంబద్ద డిమాండ్లతో సమ్మెకు వెళ్లే ఎవరిపైనానా ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. విధులకు అనధికారికంగా గైర్హాజరైన ఉద్యోగులను సెల్ఫ్‌ డిస్మిస్‌గానే భావించాల్సి ఉంటుందన్నారు. ‘చనిపోయిన కార్మికులకు బాధ్యత వహించాల్సింది యూనియన్లే. హైకోర్టు చర్చలు జరపాలని సూచిస్తే అందుకోసమైనా ఆగకుండా సీఎంనే తిడతారా? సెప్టెంబర్‌ నెల జీతాల కోసం కార్మికులు కోర్టుకెళ్తే ఆర్టీసీ యాజమాన్యం జీతాలకు డబ్బుల్లేనందువల్ల చెల్లించలేమని చెప్పింది. ఇప్పుడు కోర్టు ఏమైనా మమ్మల్ని కొడుతుందా? కేవలం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనిని మాత్రమే కోర్టు చెప్పింది. అసెంబ్లీని రద్దు చేయాలని ఎవడో బేవకూఫ్‌ అంటే రద్దు చేస్తమా? కార్మికుల బ్రతుకులను కార్మిక సంఘాలు నాశనం చేస్తున్నాయి. ఉద్యోగం కావాలంటే వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

భేషజాలకు పోకుండా.. వాస్తవాలే చెబుతున్నాం
‘ఆర్టీసీపై నాకున్నంత అవగాహన, అభిమానం ఎవరికీ లేదు. గతంలో ఉమ్మడి ఏపీలో రవాణా మంత్రిగా రూ. 13.80 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో సంస్కరణలు తెచ్చి ఏడాదిన్నరలో నష్టాన్ని పూడ్చటంతోపాటు రూ. 14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా భేషజాలు తగ్గించుకొని రూ. 1.84 లక్షల కోట్లుగా ఉన్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మాంద్యం మూలంగా రూ. 1.36 లక్షల కోట్లకు తగ్గించుకున్నాం. మరో రూ. 10 వేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సేకరించాలని నిర్ణయించుకున్నాం. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని బీజేపీ డంబాచారం చెబుతున్నా పెద్ద కంపెనీలు మూతపడుతూ ఉద్యోగాలు పోతున్నాయి. ఆటోమొబైల్‌ రంగం కుప్పకూలింది. ‘ష్ట్రంలో గత ఐదేళ్లుగా 21 శాతం ఉన్న వృద్ధి రేటు 2.3 శాతానికి పడిపోయింది.

ఇలాంటి విపత్కర పరిస్థితిలో అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నాం. ఆర్టీసీ ప్రస్తుతం రూ. 5 వేల కోట్ల అప్పుల్లో ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు వడ్డీ కట్టే పరిస్థితి లేకున్నా పీఎఫ్‌ సొమ్మును ప్రభుత్వం వాడుకుందని యూనియన్లు కోర్టుకు అబద్ధాలు చెబుతున్నాయి. ప్రతి నెలా రూ. 100 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఏటా రూ. 1,200 కోట్ల నష్టం వస్తోంది’ అని కేసీఆర్‌ వెల్లడించారు. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వం బాధ్యతని, కేబినెట్‌తో సంబంధం లేకుండా తాను ఒక్క సంతకం పెడితే వేల బస్సులు రోడ్లపైకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రవాణా చట్టం నిబంధనల ప్రకారం 7 వేల ప్రైవేటు బస్సులకు సంబంధించి 5–6 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఆర్టీసీని కాపాడేందుకు ఎంతో ప్రయత్నించాం...
అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులకు రెండు పర్యాయాలు 67 శాతం వేతనాలు పెంచాం. సగటున రూ. 50 వేల జీతం వస్తున్నా పలికిమాలిన డిమాండ్లతో వారి కాళ్లు వారే నరుక్కుంటున్నారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,550 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన రూ. 550 కోట్లలో ఇప్పటికే రూ. 425 కోట్లు విడుదల చేశాం. అద్దె బస్సులపై కిలోమీటర్‌కు 75 పైసల లాభం వస్తే ఆర్టీసీ బస్సులపై కిలోమీటర్‌కు రూ. 13 చొప్పున నష్టం వస్తోంది. ఆర్టీసీ రోజుకు రూ. 11 కోట్ల నష్టంలో నడుస్తోంది.

దసరా పండుగ సందర్భంగా రూ. 125 కోట్ల నుంచి రూ. 175 కోట్ల ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉన్నా కార్మికులు ఆర్టీసీకి నష్టం చేకూర్చారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సముదాయించినా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని యూనియన్లు పట్టుబట్టాయి. ఇప్పుడు సంస్థ వద్ద రూ. 6–7 కోట్లు మాత్రమే ఉన్నాయి. కోర్టు చెప్పినా కార్మికుల వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. గతంలో దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న కలకత్తా నగరం కార్మిక సంఘాల చర్యలతో నష్టపోయిన తీరును సీఎం ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్న విషయాన్ని విలేకరులు గుర్తుచేయగా ‘‘ఒక్క ఆర్టీసీ కార్మికులే సమ్మెలో పాల్గొన్నారా? వారి ఒక్కళ్ల వల్లే తెలంగాణ వచ్చిందా?’’ అని కేసీఆర్‌ ఎదురు ప్రశ్నించారు. 
 

మరిన్ని వార్తలు