బహుళ ప్రయోజనకారి

22 Jul, 2015 01:34 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిపై కూడా దృష్టిసారించారు. ఇటీవల ప్రకటించిన యాదాద్రి అభివృద్ధి పనుల ప్రణాళికలో భువనగిరి మండలం బస్వాపురం, తుర్కపల్లి మండలం గందమల్ల రిజర్వాయర్‌ల గురించి కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే 0.8 టీఎంఎసీల గోదావరి నీటినిల్వ సామర్థ్యంతోనిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్‌ను 8  టీఎంసీలుగా పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందున్న ప్రభుత్వం బస్వాపురం రిజర్వాయర్ ద్వారా జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు, హైదరాబాద్ ప్రజలకు తాగు నీటి వసతిని కల్పించడం ముఖ్య ఉద్దేశంగా రిజర్వాయర్ పనులు డిజైన్ చేసింది. తాజాగా రిజర్వాయర్ సామర్థ్యం పెంచడం ద్వారా గరిష్ట స్థాయిలో ప్రజలు లబ్ధిపొందాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. త్వరలో ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం.
 
 యాదాద్రి పరిధిలోకి
 బస్వాపురం రిజర్వాయర్ స్థాయి పెంచడం ద్వారా సీఎం  కేసీఆర్ యాదాద్రి అభివృద్ధి పటంలో చేర్చినట్లు అయ్యింది. దీంతో రిజర్వాయర్‌లో బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా ఉంది. వైటీడీఏ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా బస్వాపురం చెరువును అభివృద్ధి చేయడం అంటే దీన్ని కూడా అందులో కలిపే ఉద్దేశం కన్పిస్తోంది. యాదాద్రి మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చితే దేశ, విదేశాల భక్తులు యాదగిరిగుట్టకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గుట్ట పరిధిలో ఉద్యాన వనాలు, అభయారణ్యాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు,కల్యాణ మంటపాలు, విశాలమైనరోడ్లు,  ఇలా భక్తులకు మానసిక, ఆధ్యాత్మిక భావనను కల్పించడానికి కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారు. మరో 10 రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
 
 రిజర్వాయర్‌గా మారిన బస్వాపురం చెరువు
 భువనగిరి మండలం బస్వాపురం చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. 0.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు 8 టీఎంసీలుగా మార్చడానికి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఇందు కోసం 1400 ఎకరాలు అవసర ఉంది. గతంలో 0.8 టీఎంసీల కోసం సుమారు 630 ఎకరాల భూమిని రిజర్వాయర్ కోసం సేకరించారు. మిగతా భూమిని సేకరించడానికి సర్వే చేపట్టారు. మిగులు జలాలను నిల్వ చేసి  ఇక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీటితో పాటు జిల్లాలోని మిగతా ప్రాంతాలకు సాగునీటి సరఫరా చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం.
 
 

>
మరిన్ని వార్తలు