మార్పు రాకుంటే  ఉపేక్షించం : సీఎం కేసీఆర్‌

12 Feb, 2020 01:25 IST|Sakshi

కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ

పల్లె ప్రగతి బాట పట్టాలి.. ఆ బాధ్యత అంతా మీదే

రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యతలు

పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలి

రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్లకే..

గుట్టలపై ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలివ్వాలని సీఎం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ‘గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పరిపాలనా విభాగాలు చిన్నవయ్యాయి. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడకుండా ప్రతినెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నాం. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించాం. ఎంపీఓ, ఎంపీడీవో, డీఎల్పీవో, డీపీఓ, జడ్పీ సీఈఓ వంటి పోస్టులన్నింటినీ భర్తీ చేశాం. ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాం. ప్రతీ గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం కలెక్టర్లపై నమ్మకంతో తన అధికారాలను వారికి బదిలీ చేసింది. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు.

ప్రగతిభవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 11 గంటలపాటు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ మారథాన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, పజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప.. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని స్పష్టంచేశారు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలని, రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ‘విస్తృత మేధోమథనం, అనేక రకాల చర్చోప చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ– విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత. వారి పనితీరుకు ఇదే గీటురాయి. మొక్కలు నాటి, సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే సమస్యే లేదు’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల నిర్వహణను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ‘రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలోనే ఉంటుంది. భూ సంబంధ రికార్డులు పక్కాగా ఉండాలి. కచ్చితంగా సంస్కరణలు రావాలి. 95 శాతం భూముల విషయంలో ఎలాంటి పేచీ లేదు. మిగతా వాటిని పరిష్కరించాలి’ అని సూచించారు. ఇంకా పలు అంశాలపై సీఎం ఏమన్నారంటే...

అదనపు కలెక్టర్లకు  వేరే పనులు వద్దు...
అదనపు కలెక్టర్లలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించాం. వారికి మరో పని అప్పగించవద్దు. ఒక అడిషనల్‌ కలెక్టర్‌ కేవలం స్థానిక సంస్థలను సమర్థవంతంగా పని చేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలి. వారి కంప్యూటర్లో అన్ని గ్రామాలు, పట్టణాల చరిత్ర, సంపూర్ణ వివరాలు ఉండాలి. అదనపు కలెక్టర్లందరికీ రెండు రోజుల పాటు ‘గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి’పై శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఈ తరగతులకు కలెక్టర్లను కూడా ఆహ్వానించాలి. రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్‌ సమ్మేళనం’నిర్వహించాలి. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఆహ్వానించాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్లను ముఖ్య అతిథులుగా పిలవాలి. సమావేశం తర్వాత పది రోజుల గడువు ఇవ్వాలి. ఆలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పర్యటిస్తాయి. ముఖ్యమంత్రిగా నేను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తాను. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి.

అన్ని విషయాలపై అవగాహన ఉండాలి...
సివిల్‌ సర్వీస్‌ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్న యువ ఐఏఎస్‌ అధికారులే రేపు రాష్ట్రానికి కార్యదర్శులుగా, శాఖాధిపతులుగా వివిధ హోదాల్లో పనిచేస్తారు. అందువల్ల మంచి విధానాలు అమలవుతున్న ఇతర దేశాల పర్యటనలకు వెళ్లాలి. అన్ని రంగాల్లో ఉత్తమ పద్ధతులు, విధానాలను వారు అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయాలి.

మున్సిపల్‌ శాఖలో ఖాళీల భర్తీ..
పంచాయతీ రాజ్‌ శాఖ మాదిరిగానే మున్సిపల్‌ శాఖలో కూడా అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని ఖాళీలున్నాయి. ఎక్కడెక్కడ ఏ పోస్టులు భర్తీ చేయాలో మున్సిపల్‌ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కూడా సమకూరుస్తాం. హైదరాబాద్‌ నగరానికి నెలకు రూ.78 కోట్ల చొప్పున.. మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేస్తాం. ఈ నిధులతో పాటు, స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. గ్రామాలు, పట్టణాల్లో వందకు వంద శాతం పన్నులు వసూలు చేయాలి. గ్రామాల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లే పట్టణాల్లో చెత్త సేకరణకు వాహనాలు కొనుగోలు చేయాలి’అని కేసీఆర్‌ ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పాటు పట్టణ పరిపాలనకు సంబంధించి వ్యవహరించాల్సిన తీరుపై మంత్రులు కె.తారకరామారావు, శ్రీనివాస్‌గౌడ్‌ కలెక్టర్లకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం సహా ఇతర అంశాలపై సీనియర్‌ అధికారులు, కలెక్టర్లు తమ అభిప్రాయాలు తెలిపారు. పీసీసీఎఫ్‌ శోభ  హరితహారం, అడవుల పునరుద్ధరణపై వివరించారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ సత్యనారాయణ కొత్త మున్సిపల్‌ చట్టంపై వివరణ ఇచ్చారు.

హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు తగ్గించాలి
‘సముద్రం ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరగడానికి అవకాశాలెక్కువ. ఇప్పుడు హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం కాక తప్పదు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. హైదరాబాద్‌ నగరం లోపల, చుట్టూ కలిపి లక్షా 60వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో అడవులు పెం చాలి. వనస్థలిపురంలోని హరిణి వనస్థలిని కేబీఆర్‌ పార్కులాగా తయారు చేయాలి. హైదరాబాద్‌లో కాలుష్యం నివారించడానికి అనుగుణమైన ప్రణా ళిక రూపొందించి అమలు చేయాలి. డీజిల్‌ వాహనాలు తగ్గించి, ఎలక్ట్రానిక్‌ వాహనాల సంఖ్య పెంచే చర్యలు తీసుకోవాలి. ఈ నగరాన్ని కాలుష్యమయం కాకుండా చూసుకోవాలనే స్పృహ కలిగిలా తీసుకోవాలి’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు. 

ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండాలి..
‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలోనే అద్భుత ప్రగతి సాధించాం. విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి వసతి ఏర్పడుతోంది. ఇప్పుడు మన ముందున్న అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని.. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడమే. ఇక కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి, కంటివెలుగు వంటి కార్యక్రమాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాలు. ఎంతో మేధోమథనం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తుంది. అలాంటి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో కలెక్టర్లు అమలు చేయాలి. కలెక్టర్‌ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పరిపాలనను క్రమబద్ధం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కలెక్టర్లకు అండగా ఉండడం కోసం అదనపు కలెక్టర్లను నియమించాం. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలి. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం, బాధ్యతలు ఉంచింది. కొత్తగా తెచ్చిన పంచాయతీ రాజ్, మున్సిపల్‌ చట్టాల అమలులో కలెక్టర్ల బాధ్యత పెరిగింది. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్‌గా వ్యవహరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చాం. దీనివల్ల కొంత పనిఒత్తిడి తగ్గుతుంది. కలెక్టర్లు ఇతర అధికారులతో సంప్రదింపులు జరపడానికి వీలుగా వైర్‌లెస్‌ సెట్లు సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నాం.

‘పట్టణ ప్రగతి’పై శిక్షణ ఇవ్వాలి..
పల్లె ప్రగతి తరహాలోనే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగా పట్టణాలు, నగరాల్లో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో మున్సిపల్‌ సమ్మేళనం నిర్వహించాలి. మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కమిషనర్లను ఈ సమావేశానికి పిలిచి శిక్షణ ఇవ్వాలి. పట్టణ ప్రగతి కార్యక్రమం కన్నా ముందే అన్ని వార్డుల్లో కమిటీలు నియమించాలి. ఈ కార్యక్రమానికి పట్టణా ల్లోని వార్డును యూనిట్‌గా చూడాలి. ఆ వార్డులోని ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వం నియమించే ప్రజాకమిటీలోని సభ్యులు పట్టణ ప్రగ తి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణంలో పాదయాత్రలు చేసి, వార్డులవారీగా సమస్యలు గుర్తించాలి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని పార్కులు, ఇతర అవసరాలకు వినియోగించాలి. అన్ని పట్ట ణాలకు 2 కిలోమీటర్ల దూరంలో వాకింగ్‌కు అనుకూలంగా పార్కులను అభివృద్ధి చేయాలి. గుట్టలు, కొండల మీద గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి పట్టాలివ్వాలి. పట్టణాల్లో రూ.5లక్షల వరకు వ్యయం చేసే పనులను కలెక్టర్‌ అనుమతితో చేపట్టవచ్చు. ఇళ్లపై వేలాడే కరెంట్‌ వైర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామానికి ఒక నర్సరీ పెట్టినట్టే, పట్టణాల్లో కూడా అక్కడి జనాభాను బట్టి అవసరమైనవన్ని నర్సరీలు ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో స్థలం దొరకకపోతే సమీప గ్రామంలో పట్టణానికి సంబం ధించిన నర్సరీ ఏర్పాటు చేయాలి. అన్ని పట్టణాల్లో వెజ్‌/నాన్‌ వెజ్‌ మార్కెట్లు నిర్మించాలి. మున్సిపల్‌ కార్పొరేషన్లలో కనీసం మూడు చొప్పున, పట్టణాల్లో కనీసం ఒకటి చొప్పున ఈ మార్కెట్లను నిర్మించాలి. వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు, మరీ ముఖ్యం గా మహిళలు టాయిలెట్లు లేక చెప్పరాని అవస్థలు పడుతున్నారు. అన్ని పట్టణాల్లో విధిగా పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలి. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి. ముందుగా కలెక్టరేట్లలో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలి. ప్రత్యామ్నాయం చూపించకుండా వీధుల వెంట షాపులు నిర్వహించేవారిని, టాక్సీ స్టాండ్లను, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునేవారిని బలవంతంగా తరలించొద్దు. మెదడువాపుతో పాటు ఇతర వ్యాధులకు కారణమవుతున్న పందుల నివారణకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పందులను పోషిస్తూ జీవించే వారికి ప్రత్యేక ఉపాధి చూపించాలి.

దట్టంగా అడవులు పెంచాలి...
పల్లె ప్రగతి కొద్దికాలం చేసి ఊరుకునే కార్యక్రమం కాదు. నిరంతరం సాగాలి. దేశం లో ఆదర్శ పల్లెలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలి. గ్రామాల్లో ఎవరు చేయాల్సిన పనిని వారితోనే చేయిం చాలి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవస్థతో పనిచేయిం చాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను కచ్చితంగా బతికించాలి. గ్రామం లో స్మశాన వాటికలు, ఖనన వాటికలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలి. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తివేయడానికి ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలి. గ్రామాల్లో పర్యటించినప్పుడు మీ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రా ముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.కోటి అందుబాటులో ఉంచుతాం. గ్రామాల్లో మొక్కలు నాటడం మాత్రమే కాదు. అడవుల్లో కలప అక్రమ రవాణాను అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. చెట్లు నరకకుండా చూడాలి. అటవీ భూముల్లో దట్టమైన అడవులు పెంచాలి. పదెకరాల అటవీభూమిలో అడవిని అభివృద్ధి చేయడం పదివేల ఎకరాల్లో సామాజిక అడవులు పెంచడంతో సమానం. కాబట్టి అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. గ్రీన్‌ ప్లాన్‌ అమలుకు నిధుల కొరత రాకుండా బడ్జెట్‌ లో నిధులు కేటాయిస్తాం. 

సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలి..
ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నాయి. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించాలి. కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలి. అక్షరాస్యతలో వెనకబడిన రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతినబూనాలి. గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలి. జిల్లాను పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లాగా మార్చే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. వారు సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలి. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
 

మరిన్ని వార్తలు