గైర్హాజరైన ఉద్యోగులపై నిర్ణయం తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి శనివారమే సమీక్ష ఉందన్న సమాచారంతో అధికారులు ప్రగతిభవన్కు చేరుకున్నాక, ఆదివారానికి వాయిదే వేసినట్లు ప్రకటించారు. సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇలా సమ్మెలు జరిగినప్పుడల్లా ఇబ్బందులు ఏర్పడటం, ప్రత్యామ్నాయ చర్యలకు సమస్యగా ఉం డటంతో దీనికి శాశ్వత పరిష్కారం అవసరమని భావిస్తున్నారు.
ఇప్పటికే ఆయన ఈ విషయంలో నిపుణులతో మాట్లాడినట్లు సమాచారం. సమ్మెలో పాల్గొనే ఆర్టీసీ ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ఇప్పటికే నిర్ణయించారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు హాజరైనవారు తప్ప మిగతా వారిని డిస్మిస్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ గడువులోగా డ్రైవర్లు, కండక్టర్లు హాజరు కాలేదు. సూపర్వైజరీ కేడర్ అధికారులు కూడా సమ్మెకే పరిమితమయ్యారు. హెచ్చరిక ప్రకారం.. సమ్మెలో ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారా లేదా మరో గడువు నిర్ధారిస్తారా అన్నది తేలలేదు.
శనివారం రాత్రి వరకు ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి సమీక్షలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వారిపై చర్యల విషయంలో న్యాయపరమైన సలహా తీసుకుంటోందని, ఒక్కసారే దాదాపు 55 వేల మందిపై చర్యలు తీసుకుంటే న్యాయపరమైన పర్యవసానాలపై మాట్లాడినట్లు సమాచారం. వీలైనన్ని అద్దె బస్సులు తీసుకునే దిశగా అధికారులకు సూచనలు అందినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సుల పరిమితి 25 శాతంగా ఉంది. మొత్తం బస్సుల్లో 25 శాతం మేర అద్దె బస్సులు ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈ పరిమితిని భారీగా పెంచే అవకాశం ఉంది. దీంతో ఆదివారం నాటికి ఆ బస్సులు మరిన్ని పెరగనున్నాయి. శనివారం ఈ అద్దె బస్సుల వల్లే ప్రయాణికులకు కొంత ఊరట కలిగింది. మరి ఈ బస్సుల పెంపుపై సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. మరో 3 నుంచి 4 వేల బస్సులను అద్దెకు తీసుకుని నడపాలని భావిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శని వారం ప్రకటించారు. 6 వేల నుంచి 7 వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు విధులకు రాని వారిని భవిష్యత్తులో కూడా ఉద్యోగులుగా పరిగణించబోమని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.