చిట్ట చివరి రైతుకూ రైతుబంధు

12 Jul, 2020 03:17 IST|Sakshi

ఏ మూలన ఉన్నా గుర్తించి అందించాలి

యాజమాన్య హక్కుల పరిష్కారానికి స్పాట్‌ ఎంక్వైరీ నిర్వహించాలి

చుట్టు పక్కల రైతులను విచారించి హక్కులు కల్పించాలి

ఇందుకు లక్ష్మాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

వ్యవసాయంపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్టచివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ‘కాస్తులో ఉన్నప్పటికీ కొంతమంది రైతులకు యాజ మాన్య హక్కుల విషయంలో చిన్నచిన్న సమస్యలు ఉండటం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్‌ ఎంక్వైరీ) నిర్వహించాలి. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలి.

అందరి సమస్యలు పరిష్కరించి, అందరికీ సాయం అందిం చాలి. ఈ విషయంలో రైతుబంధు సమితుల, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. ఒకసారి పరిష్కారం అయిపోతే, ఎప్పటికీ గొడవ ఉండదు. అది అన్ని తీర్లా మంచిది’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి శనివారం నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘మేడ్చల్‌ జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదు. ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే జరిపింది. ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించడం జరిగింది. మిగతా చోట్ల కూడా అదే జరగాలి’అని సిఎం కోరారు. 

99.9 % రైతులకు సహాయం అందింది..
‘కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయం విడుదల చేసింది. అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సాయం అందించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలి.

దీనికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడదు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్‌ లిమిట్‌ లేదు. వందకు వంద శాతం రైతులందరికీ సాయం అందడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తనకు రైతుబంధు సాయం అందలేదని అనవద్దు’అని సీఎం స్పష్టం చేశారు. ‘రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలపై వెంటనే నివేదిక సమర్పించాలి. క్లస్టర్ల వారీగా నివేదికలు తెప్పించాలి. రైతుబంధు సమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించాలి. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి వెంటనే సాయం అందించాలి. భూముల క్రయవిక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదు చేయాలి’అని సీఎం ఆదేశించారు. 

రైతులందరికీ శుభాకాంక్షాలు..
‘రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామం. తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. రైతు సంక్షేమం– వ్యవసాయాభివద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నది’అని కేసీఆర్‌ అన్నారు. ‘దసరాలోగా రైతు వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలి. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయి’అని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

విత్తనాలకు కోల్డ్‌ స్టోరేజీ 
‘‘తెలంగాణ గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నది. పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లు చేపట్టాయి. అలా తయారు చేసిన విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్‌ కోల్డ్‌ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావాల్సిన నిధులు కూడా వెంటనే విడుదల అవుతాయి.

ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి’’అని సిఎం చెప్పారు. మంత్రులు ఎస్‌. నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్‌ రెడ్డి, రామకష్ణ రావు, నర్సింగ్‌ రావు, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండి కేశవులు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు విజయ్‌ కుమార్, డిడిఎ శైలజ, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు