-

చివరి రక్తం బొట్టు వరకూ పోరాడుతా: కేసీఆర్‌

27 Apr, 2017 20:43 IST|Sakshi
చివరి రక్తం బొట్టు వరకూ పోరాడుతా: కేసీఆర్‌

వరంగల్‌: తన శరీరంలోని చివరి రక్తం బొట్టు వరకూ తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాడుతూనే ఉంటానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఒకడు చెవులు కోసుకుంటానని, మరొకడు గడ్డం పెంచుకుంటానని అంటున్నారని, 2019 ఎన్నికల్లో మనం విజయం సాధించాక ఎవరు ఏం కోసుకుంటారో చూద్దామని చెప్పారు.

పదహారేళ్ల ఏళ్ల కిందట టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడినప్పుడు.. పార్టీ ఉండబోదని అన్నారని, కానీ అలా ఉండదని అన్నవాళ్లే ఇప్పుడు పోయారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఇప్పుడు సాధించిన కీర్తి, విజయాల క్రెడిట్‌ పార్టీ శ్రేణులదేనని కొనియాడారు. స్వరం నుంచి జయశంకర్‌ సార్‌ మనల్ని ఆశ్వీరదిస్తున్నారని పేర్కొన్నారు.  గురువారం వరంగల్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు హాజరైన రైతులకు పాదాభివందనం, పార్టీ శ్రేణులకు ఉద్యమాభివందనం చేశారు. ఓరుగల్లు.. పోరుగల్లు.. అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. అన్నం తిన్నమో.. అటుకులు బుక్కినమో.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, కష్టాలు ఎదుర్కొన్నా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేవరకు వదిలిపెట్టలేదని, ఇప్పుడు సాధించిన తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

  • తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను అధిగమించాం.
  • కరెంటు పోకుండా, ఒక్క బోర్‌ మోటార్‌ కాలిపోకుండా చర్యలు తీసుకున్నాం
  • తెలంగాణలో వ్యవసాయం బోర్లపై ఆధారపడి జరుగుతుంది
  • రైతులకు ఇబ్బందులు రాకుండా విజయవంతంగా విద్యుత్‌ను అందిస్తున్నాం
  • పవర్‌ హాలీడే లేకుండా మూడు షిఫ్టులలోనూ పరిశ్రమలకు విద్యుత్‌ను  అందిస్తున్నాం
  • దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలకు రూ. 40వేలకోట్లు అందజేస్తున్నాం
  • పరమపథం పథకం కింద నిరుపేదలు చనిపోతే.. వారి మృతదేహాలను ఆస్పత్రి నుంచి ఇళ్లకు ఉచితంగా తరలించే సేవలు అందిస్తున్నాం
  • ఈ ఏడాది ముగిసేలోపే ప్రతి గ్రామానికి ’మిషన్‌ భగీరథ’  కింద తాగునీరు అందనుంది
  • పాలన సంస్కరణలలో భాగంగా కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటుచేశాం
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపరిచేందుకు, వెనుకబడిన, అణగారిన కులాల అభివృద్ధి చర్యలు తీసుకున్నాం
  • రాష్ట్రానికి ప్రతిరోజూ 650 లారీల గొర్రెలు రోజూ దిగుమతి అవుతున్నాయి
  • ఈ పరిస్థితి మార్చేందుకు ప్రతి గొల్ల, కురుమ కుటుంబానికి 21 గొర్రెలను అందించబోతున్నాం
  • మొత్తం 80 లక్షల గొర్రెలు సరఫరా చేస్తాం.
  • ఈ పథకం ద్వారా మన గొల్ల, కురుమ సోదరులు రూ. 20 కోట్ల సంపదను సృష్టించబోతున్నారు
  • నాయి బ్రాహ్మణుల కోసం 25వేల నవీన క్షౌరశాలలు ఏర్పాటుకు రూ. లక్ష సబ్సిడీ ఇవ్వబోతున్నాం.
  • ఐదుకోట్ల ఈత, తాటికల్లు చెట్లు పెంచే చర్యలు చేపడుతున్నాం
  • మందు కల్లుపోవాలి, మంచి కల్లు రావాలి
  • తెలంగాణలో ధనిక రైతాంగముండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
  • అందుకే వచ్చే మే నెల నుంచి రూ. 4వేల చొప్పున రెండువిడతలుగా సబ్సిడీ రైతులకు అందజేయబోతున్నాం
  • కాంగ్రెస్‌ నేతలు శిఖండిలా ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుపడుతున్నారు
  • నాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకుండా కాంగ్రెస్‌ నేతలు నోళ్లు మూసుకొని ఉన్నారు
  • అందుకే తెలంగాణ ఇలా మారింది.
  • నా రక్తంలోని చివరిబొట్టు వరకూ తెలంగాణ వ్యతిరేక శక్తులతో పోరాడుతాను
  • 2019 ఎన్నికల్లో విజయం టీఆర్‌ఎస్‌దే

మరిన్ని వార్తలు