కొండపోచమ్మ: సీఎం కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీ

12 Jun, 2020 17:40 IST|Sakshi

సాక్షి, మర్కుక్‌ (సిద్దిపేట) : మర్కుక్‌ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీఎం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించడానికి వచ్చారు. దీంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద కొండపోచమ్మ ప్రాజెక్ట్‌ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలవడానికి, చూడటానికి భారీగా తరలివచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కట్టపై తిరుగుతూ గోదావరి జలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది)

కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నాయా అని అధికారులను, స్థానికులను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సాగర్‌లో స్నానానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతిని ఇవ్వొద్దని అధికారులను హెచ్చరించారు. కొండపోచమ్మ దిగువన ఉన్న రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అక్కడి రైతులను కేసీఆర్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాగర్‌ నిర్మాణంలో జరుగుతున్న పనులపై అధికారులు సీఎంకు వివరించారు. సాగర్‌నుంచి మల్లన్న సాగర్‌ కాలువ పనుల గురించి ఆరా తీశారు. కొండపోచ​మ్మ కుడి, ఎడమ కాలువల పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. (త్వరలో రైతులకు శుభవార్త..)

మరిన్ని వార్తలు