సీఎం నాటిన మొక్క ఎండింది!

17 Sep, 2017 03:13 IST|Sakshi
కరీంనగర్‌ క్రైం: మూడో విడత హరితహారంలో భాగంగా కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ డ్యామ్‌ సమీపంలో సీఎం కేసీఆర్‌ నాటిన మొక్క ఎండిన ఘటనలో 8 మందిపై కేసు నమోదైంది. గత జూలై 12న సీఎం హరితహారం ప్రారంభోత్సవం సందర్భంగా ‘మహగని’ మొక్క నాటారు. అçప్పటి నుంచి ఈ మొక్క సంరక్షణ బాధ్యతలను కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌ కార్మికుడు కొండ్ర సురేశ్‌ చూస్తున్నారు. ఈ నెల 9న రాత్రి మొక్కను పరిశీలించేందుకు సురేశ్‌ వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు మొక్కతోపాటు కంచెను తీసేందుకు యత్నిస్తున్నారు.

సురేశ్‌ వారించడంతో చంపుతామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. తిరిగి శనివారం ఉదయం చూడగా మొక్క ఎండిపోయి కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు మొక్కను పీకడం వల్లే ఎండిపోయిందని, అడ్డుకున్నందుకు తనను చంపుతామని బెదరించారని సురేశ్‌ కరీంనగర్‌ టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. సురేష్‌ ఫిర్యాదుతో ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌గౌడ్‌ తెలిపారు.