సీఎం పర్యటన షెడ్యూలు ఖరారు

16 Sep, 2014 01:38 IST|Sakshi

* 18న మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తూరులో జన్సన్ అండ్ జాన్సన్  కంపెనీ ప్రారంభం
* సీఎం పర్యటనను  విజయవంతం చేయాలని  అధికారులకు కలెక్టర్ ఆదేశం

 
మహబూబ్‌నగర్ టౌన్: ఈనెల 18న సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి రెవెన్యూ సమావేశ మందిరంలో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18న మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తూర్ మండలానికి ముఖ్యమంత్రి చేరుకుని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీని ప్రారంభిస్తారని వెల్లడించారు.
 
అనంతరం జడ్చర్ల పోలేపల్లి సెజ్‌లోని హెటిరో కంపెనీలోని ఓ యూనిట్, అలాగే సబ్‌స్టేషన్, బీటీరోడ్డును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం అడ్డాకల్ మండలం మూసాపేట్‌లోని కోజెంట్ గ్లాస్ కంపెనీలోని ఓ నూతన యూనిట్‌ను ప్రారంభించి తిరిగి హైదారాబాద్‌కు సాయంత్రం 5:55 గంటలకు వెళ్తారని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
 
 24నుంచి బతుకమ్మ సంబరాలు
 ప్రభుత్వం తరఫున నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలను ఈనెల 24నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేయాలని కోరారు. 23లోగా పాఠశాలల విద్యార్థులచే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 24న గ్రామ, 25న మండల, 28న డివిజన్, 30న జిల్లా స్థాయిలో ఉత్సవాలను జరిపించాలని కోరారు. మండలానికి తహశీల్దార్లు, డివిజన్‌కు ఆర్డీఓలు ఉత్సవాలను పర్యవేక్షించాలన్నారు.
 
జిల్లాస్థాయిలో డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. ఇందుకోసం ఒక మానిటరింగ్ కమిటీని నియమించుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో ప్రతిభచూపిన వారిలో ప్రథమ బహుమతి కింద రూ.వెయ్యి, రెండో బహుమతి రూ.500, మూడో బహుమతి రూ.300 చొప్పున అందజేస్తామన్నారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మన్, డీఆర్‌ఓ రాంకిషన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు