ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తున్నారు..

4 Dec, 2019 07:37 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మడత వెంకట్‌ గౌడ్‌ వర్గీయులు

హరిప్రియ వర్గీయులపై మడత గ్రూప్‌ ఫైర్‌

అవాకులు, చవాకులు పేలితే సహించబోమని హెచ్చరిక

ఇల్లెందు: ఎమ్మెల్యే హరిప్రియ వర్గీయులే ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నారని, తమపై అవాకులు, చివాకులు పేడితే సహించబోమని మడత వెంకట్‌గౌడ్‌ వర్గీయులు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం జగదాంబా సెంటర్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు సిలివేరు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్‌ హాబీబ్‌బేగ్‌లు మాట్లాడుతూ.. గులాబీ కండువాలు వేసుకోని వారు కూడా తమ గురించి, పార్టీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీ ప్రారంభం నుంచి జెండా మోసిన తమకే పార్టీ నియమావళి, క్రమశిక్షణ నేర్పుతున్నారని, తాము టీఆర్‌ఎస్‌లో లేకుండా ఎక్కడున్నామో తేల్చాలని వారు డిమాండ్‌ చేశారు. ఒక నాయకుడు 15 ఏళ్ల క్రితం పార్టీ నిధులు స్వాహా చేస్తే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన చరిత్ర మర్చిపోయి మాట్లాడితే చరిత్ర క్షమించదన్నారు.

30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకుంటున్న వారు ఈ ప్రాంతం కోసం పుల్లంత పని చేయలేదన్నారు. కనీసం ఒక్కరికైనా కులం, ఆధాయం ధ్రువపత్రమైనా ఇప్పించిన చరిత్ర మీకుందా అని ప్రశ్నించారు. కోట్లు సంపాదించుకోవటం పని చేసే మీరు ఇతరుల గురించి మాట్లాడే ముందు తమ గురించి కూడా తెలుసుకోవాలని హితవు పలికారు. రొంపేడు పంచాయతీలో ఓ గిరిజనుడి భూమి 20 ఎకరాలు పట్టా చేయించుకున్న చరిత్ర మీదని ఆరోపించారు. వెంకట్‌గౌడ్‌ మీద చేసిన ఆరోపణలకు ఆధారాలతో రావాలని, అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరన్నారు. స్టేషన్‌బస్తీ మీటింగ్‌లో మాట్లాడిన విషయాలు వాస్తవాలేనని స్పష్టం చేశారు. మడత వెంకట్‌గౌడ్‌ వర్గీయులు అసలు టీఆర్‌ఎస్‌నా కాదా తేల్చమని సవాల్‌ విసిరారు. పార్టీ కార్యక్రమాలు అంటే అందరికి తెలిపి చేయాలని, కొంత మందికి తెలిపి రహస్యంగా చేయటం అవాకులు, చెవాకులు పేలుతున్నారని భావ్యమా అని ప్రశ్నించారు. మడత వెంకట్‌గౌడ్‌ గాలి నుంచి ఊడి పడలేదని, కేసీఆర్‌నే చేర్చుకున్నారని గుర్తు చేశారు. 


గత ఎన్నికల్లో 15 వేల మెజార్టీ సాధించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజుల విమర్శలు చేసే వారు ఆనాడు ఎక్కడ ఉన్నారని, ఎవరి గెలుపు కోసం పని చేశారో చరిత్ర ప్రజల ముందు ఉందన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో అవినీతి జరిగిందని గగ్గోలు పెడితే ఆనాడే విచారణ జరిగిందని, దోషులను ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. పార్టీని ఎలా కాపాడుకోవాలో, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండాను మున్సిపాల్టీ మీద ఎలా ఎగుర వేయాలో తమకు తెలుసని, బెదిరింపులకు భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఇల్లెందు మున్సిపాల్టీలో గులాబీ జెండా ఎగుర వేసి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నేతలు గీకూరి వెంకన్న, కమల్‌కోరీ, అబ్ధుల్‌ మన్నాన్, గుండంపల్లి సతీష్, ఇమామ్, మానుపూరి రమేష్, జబ్బార్, కన్నా, గిరి,వీరస్వామి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు