ఫీజా.. బడితెపూజా!

3 Oct, 2019 03:41 IST|Sakshi

ఏఎఫ్‌ఆర్‌సీ నిబంధనలకు ఇంజనీరింగ్‌ కాలేజీల తిలోదకాలు

నిర్దేశిత ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తున్న వైనం

యాజమాన్యాలు ఫిక్స్‌ చేసిన ఫీజులు చెల్లించాలని హుకూం

ఈ నెల 5లోగా చెల్లించాలంటూ విద్యార్థులకు నోటీసులు

రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ మండలంలోని ఒక ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మహేశ్‌కు (పేరుమార్చాం) కాలేజీ యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేసింది. 2019–20 విద్యా సంవత్సరం ట్యూషన్‌ ఫీజు, అక్రిడిటేషన్, మిస్లీనియస్‌ కింద రూ.2,05,000 చెల్లించాలని అందులో స్పష్టం చేసింది. మహేశ్‌ 2018–19 విద్యా సంవత్సరంలో ట్యూషన్‌ ఫీజు, అక్రిడిటేషన్, మిస్లీనియస్‌ కింద రూ.1,13,500 మాత్రమే చెల్లించాడు. ఏఎఫ్‌ఆర్‌సీ నిబంధనల ప్రకారం ఈ మేరకు ఫీజు తీసుకోవాల్సి ఉండగా.. కాలేజీ యాజమాన్యం మాత్రం రూ.91,500 ఫీజు పెంచేసి విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ ఫీజులను ఇష్టానుసారంగా పెంచేస్తున్న కళాశాల యాజమాన్యాలు.. విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఏఎఫ్‌ఆర్‌సీ (అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ) నిర్దేశించిన ఫీజులు కాకుండా కాలేజీ యాజమాన్యాలు ఖరారు చేసిన ఫీజులు తక్షణమే చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. కటాఫ్‌ తేదీలను విధిస్తూ ఆ లోపు చెల్లించకుంటే అపరాధ రుసుములు చెల్లించాల్సి వస్తుందంటూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటా ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులతో పాటు కనీ్వనర్‌ కోటాలో సీట్లు పొందిన వారిపైనా ఇదే తరహాలో ఒత్తిడి తీవ్రతరం చేయడంతో ఆయా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌ లబి్ధదారులకు ట్యూషన్‌ ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు అడ్మిషన్‌ సమయంలోనే ఆయా విద్యార్థులకు సీట్ల కేటా యింపు లేఖలోనే స్పష్టం చేస్తారు. కొన్ని కాలేజీలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా అన్నివర్గాల విద్యార్థుల నుంచి ఫీజుల వసూళ్లు చేస్తున్నాయి.

డెడ్‌ లైన్‌ ఐదో తారీఖు..
విద్యా సంవత్సరం అర్ధ వార్షికం కావస్తుండటంతో కాలేజీలు ఫీజుల వసూళ్ల వేగాన్ని పెంచాయి. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను పేర్కొంటూ విద్యార్థులకు సర్క్యులర్లు పంపుతున్నాయి. ఇందులో ట్యూషన్‌ ఫీజుతో పాటు అక్రిడిటేషన్, మిస్లీనియస్‌ ఫీజులను సైతం జోడిస్తూ.. ఆ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ సమీపంలోని ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు వేరువేరుగా సర్క్యులర్లు పంపింది. కేటగిరీ–ఏ, కేటగిరీ–బీ విద్యార్థులతో పాటు ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ విద్యార్థులు ఎంతమేర ఫీజులు చెల్లించాలో స్పష్టం చేసింది. గతేడాది చెల్లించిన మొత్తాలు కాకుండా.. ప్రస్తుతం పెంచిన ఫీజులు అక్టోబర్‌ 5లోగా తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థులు తమ లాగిన్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో లేదా తమ బ్యాంకు ఖాతా ఉన్న శాఖ ద్వారా డీడీల రూపంలో సమరి్పంచాలని పేర్కొం ది. కటాఫ్‌ తేదీ తర్వాత రోజుకు రూ.50 నుంచి రూ.100 వరకు అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుందని తెలిపింది.

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన..
ఫీజుల చెల్లింపులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రూ.2 లక్షలు చెల్లించడం తమవల్ల కాదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. టాప్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ఒత్తిడి చేస్తుండటంతో చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నట్లు వాపోతున్నారు. ఈ మేరకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సంక్షేమ శాఖలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద నిధులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ లేఖలు సమరి్పస్తున్నారు. వీటిపై స్పందిస్తున్న అధికారులు.. విద్యార్థులు వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కాలేజీ యాజమాన్యాలకు అష్యూరెన్స్‌ సరి్టఫికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు