‘మంచు’కొచ్చిన ముప్పు

18 Jan, 2019 01:13 IST|Sakshi
కారును క్రేన్‌తో బయటకు తీస్తున్న దృశ్యం. (ఇన్‌సెట్‌లో) ప్రకాశ్, చాంద 

పొగమంచు కారణంగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న వాహనం..

ప్రమాదంలో దంపతులు మృతి.. 

నిజామాబాద్‌ జిల్లాలో ఘటన 

డిచ్‌పల్లి: దైవదర్శనం చేసుకొని వస్తున్న ఆ కుటుంబ పెద్దలను మృత్యువు మంచు రూపంలో కబళించింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండల పరిధిలో గురువారం జరిగింది. అతివేగం.. దట్టమైన పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
 

డిచ్‌పల్లి ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌లోని గంజ్‌రోడ్‌ కాలనీలో గనిశెట్టివార్‌ ప్రకాశ్‌ (74) (రిటైర్డ్‌ ఉద్యోగి), ఆయన భార్య చాంద (68), కొడుకులు శ్రీనివాస్, శివప్రసాద్, కోడళ్లు సుస్మిత, హారిక, మనవళ్లు శౌర్య, శితిజ్, జగన్నాథ్, మనవరాలు గాయత్రి ఈ నెల 11న ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని దర్శించుకోవడానికి వెళ్లారు. బుధవారం శంషాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. తెల్లవారుజామున వీరి వాహనం నాకాతండా సమీపంలోకి రాగానే పొగమంచు కమ్ముకోవడంతో పల్టీలు కొట్టింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు