కేసీఆర్‌పై హెచ్చార్సీలో ఫిర్యాదు

17 Oct, 2018 01:50 IST|Sakshi

వనపర్తి సభలో దివ్యాంగులను కేసీఆర్‌ కించపరిచారని ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో దివ్యాంగులను ఉద్దేశించి కుంటోళ్లు, గుడ్డోళ్లు అంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానించారని, ఇలా మాట్లాడటం వారి ని కించపరచడమేనంటూ టీపీసీసీ దివ్యాంగుల విభాగం హెచ్చార్సీని ఆశ్రయించింది. ఈ మేరకు టీపీసీసీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముత్తినేని వీరయ్య వర్మ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

అదేవిధంగా దివ్యాంగుల చట్టం 2016లో పేర్కొన్న 14 రకాల వైకల్యాల్ని గుర్తించకపోవటం వల్ల లక్షలమంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగ సమయంలో ఎన్నికల సంఘం కల్పించే సదుపాయాలను కోల్పోతున్నారని, ఇది దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరో ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హెచ్చార్సీని ఆశ్రయించిన వారిలో దివ్యాంగుల విభాగం నగర అధ్యక్షుడు సతీశ్‌గౌడ్‌ కూడా ఉన్నారు.  

మరిన్ని వార్తలు