ముగిసిన రెండు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు

1 May, 2015 03:28 IST|Sakshi

మఠంపల్లి : మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకుని శుభవార్త చర్చి ఆధ్వర్యంలో మఠంపల్లిలోని వీవీ హైస్కూల్ మైదానంలో శుభోదయ యూత్ సభ్యులు నిర్వహిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు ముగిశాయి. కాగా బుధవారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన సీనియర్ విభాగం పోటీలలో ఖమ్మం జిల్లా పాతలింగాలకు చెందిన ఆర్‌ఎన్.రెడ్డి, నంది బ్రీడింగ్‌బుల్ సెంటర్ గిత్తలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేల బహుమతిని కైవసం చేసుకున్నాయి.

అలాగే  కృష్ణా జిల్లా బడిగంకు చెందిన రామభద్ర నందిబ్రీడింగ్ సెంటర్ గిత్తలు రెండవ స్థానంలో నిలిచి రూ.40 వేలు, నల్లగొండ జిల్లా మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బోయపాటి రఫేల్‌రెడ్డి మెమోరియల్ గిత్తలు మూడవ స్థానంలో నిలిచి రూ.30వేల బహుమతిని గెలుపొందాయి. గుంటూరు జిల్లా నిమ్మగడ్డ వారి పాలెంకుచెందిన కన్నెగంటి శంషయ్యచౌదరి గిత్తలు నాలుగో స్థానంలో నిలిచి రూ.25వేలు, గుంటూరు జిల్లా సీతారామపురంకు చెందిన దాసా నారాయణరావు గిత్తలు ఐదవ బహుమతిగా రూ.20వేలు, నల్లగొండ జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురంకు చెందిన కొప్పుల శ్రీనివాసరెడ్డి గిత్తలు ఆరవ స్థానంలో నిలిచి రూ.10 వేలు గెలుపొందాయి. అర్ధరాత్రి వరకు జరిగిన పోటీలను తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ చిన్నయ్య, బ్రదర్ రవి కుమార్‌రెడ్డి, శుభోదయ యూత్ అధ్యక్షుడు తిరుమలరెడ్డి బాలశౌరెడ్డి, సర్పంచ్ స్రవంతికిషోర్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు గోపు రాజారెడ్డి, క్రిబ్‌కో ఆర్‌జేబీ మెంబర్ గాదె ఎలియాస్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు