ఉల్లంఘిస్తే జరిమానాల మోతే

30 Jul, 2018 02:55 IST|Sakshi

మోటారు వాహనాల చట్టానికి సవరణ

రాజ్యసభ ఆమోదమే తరువాయి!

సాక్షి, హైదరాబాద్‌: సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాన్ని నడుపుతున్నారా? రూ. వందే కదా ఫైన్‌ కట్టేసి పోదామనుకుంటున్నారా? మీరు పొరబడ్డట్టే. ఇక నుంచి ఇలాంటి తప్పిదాలకు రూ. వెయ్యి సమర్పించుకోవాల్సిందే. తాగిన మైకంలో డ్రైవింగ్‌ చేసి రూ. 2 వేలు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకోకండి. చట్టం దాన్ని రూ. 10 వేలకు పెంచింది మరి. ఇష్టమొచ్చినట్లు బండి నడిపితే ఎవరు చూస్తారులే అని గప్‌చుప్‌గా ఉందామనుకుంటే ట్రాఫిక్‌ పోలీస్‌ రూ. వెయ్యికి బదులు రూ. 5,000 కట్టించుకుంటాడు.

లైసెన్సే లేకుండా భేషుగ్గా వాహనం నడిపేస్తున్నారా? రూ. 500 నోటు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ చేతిలో పెడితే అయిపోతుందనుకోకండి. అందుకు రూ. 5,000 జరిమానా కడితే తప్ప మీరు తప్పించుకోలేరు. ఫోన్లో మాట్లాడుతూ బండి నడిపితే ప్రస్తుతం రూ. వెయ్యి కట్టించుకుంటున్నారా.... ఇకపై రూ. 5,000 కట్టితీరాల్సిందే. రోడ్డు ప్రమాద బాధితులకు ఇప్పటివరకూ ప్రభుత్వం ఇస్తున్న రూ. 25,000 కాస్తా ఇకపై రూ. 2 లక్షలకు పెరగనుంది.

అన్నింటికంటే ముఖ్యంగా ప్రమాదాలకు కారణమవుతున్న నాణ్యతలేని రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు చెక్‌పెట్టే రోజులొచ్చేశాయి మరి. ఇప్పుడివన్నీ ఎందుకు చెబుతున్నామనుకుంటున్నారా? అదేనండీ ప్రస్తుతం లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదం కోసం వేచి ఉన్న మోటారు వాహనాల సవరణ బిల్లు 2017 పాస్‌ అయితే పైవన్నీ అమల్లోకి వస్తాయి. ఏటా 1.46 లక్షల రోడ్డు ప్రమాదాలతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న భారత్‌ 2020కల్లా రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రమాదాల అంచున సాగే ప్రయాణాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని అంతా ఆశిస్తున్నారు.

బిల్లులో ఇంకా ఏమున్నాయి....?
వాహనం నిర్ణీత ప్రమాణాల మేరకు లేకపోతే ప్రభుత్వం వాటిని వెనక్కు తెప్పించవచ్చు. కంపెనీలకు సైతం రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
దివ్యాంగులకు అవసరమైన రీతిలో వాహనాల నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.
 కాలంచెల్లిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను తిరిగి పునరుద్ధరించుకోవడానికి గతంలో ఉన్న నెల గడువును ఏడాదికి పెంచారు.
     ప్రమాదాల్లో మరణాలకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ పరిమితిని రూ. 10 లక్షలు, తీవ్రమైన గాయాలకు గురయ్యే వారికి రూ. 5 లక్షల చొప్పున చెల్లించాలని 2016 చట్టం పేర్కొంది. ఇకపై ఆ పరిమితి ఉండదు. రోడ్డు ప్రమాదాల్లో 6 నెలల్లోపే బాధితులు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మోటారు వాహనాల యాక్సిడెంట్‌ ఫండ్‌లో ఇకపై ఇన్సూరెన్స్‌ను కూడా చేర్చారు.

ప్రమాదాలకు మైనర్లు కారణమైన సందర్భంలో వాహన యజమాని లేదా మైనరు సంరక్షకులుగానీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ సంరక్షకులు, వాహన యజమానులకు ఈ ప్రమా దం తెలియకుండా జరిగినట్టు లేదా తాము నివారించే ప్రయత్నం చేశామని నిరూపించుకుంటే తప్ప వారే మైనర్ల ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది వారికి తెలిసి జరిగినట్టయి తే మోటారు వాహన రిజిస్ట్రేషన్‌ రద్దు అవుతుంది.

జువైనల్‌ చట్టం ప్రకారం నేరస్తులను విచారిస్తారు. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునే వారికి ఈ బిల్లు రక్షణ కల్పిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తోడ్పడిన వారిని నేరంలో భాగం చేయకుండా ఇది నివారిస్తుంది. బాధితులను ఆసుపత్రిలో చేర్చినప్పుడు సైతం వారు కోరితే వారి వివరాలను పోలీసులు, ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు