అందరికీ సున్నా మార్కులే..!

4 Jun, 2019 03:04 IST|Sakshi

పాలిటెక్నిక్‌ డిప్లొమా ఫలితాల్లో గందరగోళం

కాలేజీ యాజమాన్యం, బోర్డు నిర్లక్ష్యంతో తలకిందులైన ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఇంటర్‌ బోర్డు చేసిన తప్పిదాలను మరువకముందే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు (టీఎస్‌ఎస్‌బీటీఈటీ)లోనూ ఇలాంటి ఘనకార్యమే వెలుగు చూసింది. పరీక్ష రాసిన విద్యార్థులందరినీ బోర్డు మూకుమ్మడిగా ఫెయిల్‌ చేసింది. విద్యార్థులంతా చివరి సెమిస్టర్‌లో సున్నా మార్కులతో ఫెయిల్‌ కావడం గమనార్హం. ఈ నెల 1న పాలిటెక్నిక్‌ డిప్లొమా చివరి ఏడాది ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఫలితాలు చూసుకున్న విద్యార్థులు ఒక్కసారి అవాక్కయ్యారు. ప్రతిభావంతులు, ఈసెట్‌–2019 టాప్‌ ర్యాంకర్లు సైతం ఫెయిల్‌ అవ్వడంతో లబోదిబోమంటున్నారు.

అందరూ బాధ్యులే..: ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్‌ విద్యార్థులకు చివరి సెమిస్టర్‌లో ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఆధారంగా ప్రయోగ విభాగంలో మార్కులు వేయాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థి ప్రతిభ ఆధా రంగా కాలేజీ యాజమాన్యాలే నిర్దేశిస్తాయి. ఆ మార్కులను కాలేజీ యాజమాన్యమే బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కానీ పలు కాలేజీ యాజమాన్యాలు బోర్డు నిర్దేశించిన తేదీల్లో అప్‌లోడ్‌ చేయలేదు. గడువు పూర్తవడంతో అప్‌లోడ్‌ ఆప్షన్‌ను బోర్డు తొలగించింది. దీనిని ఆలస్యంగా గుర్తించిన కాలేజీ యాజమాన్యాలు విషయాన్ని బోర్డుకు వివరించగా.. మార్కులను నిర్దేశిత పద్ధతిలో పంపించాలని కోరింది. దీంతో యాజమాన్యాలు మార్కులను పం పాయి. కానీ ఫలితాల్లో విద్యార్థులకు మార్కులు యాడ్‌ కాలేదు. సోమవారం మీర్‌పేట్‌ సమీపంలోని ఓ కాలేజీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బోర్డుకు ఫిర్యాదు చేశారు.  

బోరుమంటున్న విద్యార్థులు.. 
ఈసెట్‌లో టాప్‌ 100లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో బోరుమంటు న్నారు. త్వరలో ఈసెట్‌ కౌన్సెలింగ్‌ జరగనున్న నేపథ్యంలో పొరపాట్లు సరిదిద్ది ఫలితాలు ప్రకటించాలని బోర్డు అధికారులను కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు