మహాకూటమిలో పీఠముడి

25 Sep, 2018 11:32 IST|Sakshi

కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కూడిన మహాకూటమిలో పొత్తులు కొలిక్కి వస్తున్నాయి. జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మూడింటిలో కాంగ్రెస్‌ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎల్లారెడ్డిలో మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ స్థానాన్ని టీజేఎస్‌ బలంగా కోరుతున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డిని టీజేఎస్‌కు కేటాయిస్తే కాంగ్రెస్‌లోని ఆశావహులకు మాత్రం నిరాశే మిగలనుంది. 

సాక్షి, కామారెడ్డి: అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు పలు విపక్షాలు మహాకూటమిగా జట్టుకడుతున్నాయి. పొత్తులలో భాగంగా ఎవరు ఏ స్థానంలో పోటీ చే యాలన్న దానిపై భాగస్వాముల మ ధ్య చర్చలు జరుగుతున్నాయి. కాగా కామారెడ్డిలో శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ పోటీ చేయడం ఖాయమని భావిస్తున్నారు. కామారెడ్డితోపాటు బాన్సువాడ, జుక్కల్‌ స్థానాల నూ కాంగ్రెస్‌కే కేటాయించే అవకాశాలున్నాయి. కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ మొదట బాన్సువాడ స్థానాన్ని అడిగినట్లు ప్రచారం జరిగినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థే బరిలో నిలిచే అవకాశం ఉంది. దీంతో ఇక అందరి దృష్టి ఎల్లారెడ్డి నియోజకవర్గంపైనే కేంద్రీకృతమైంది.
 
తెరపైకి రచనారెడ్డి.. 
మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఎల్లారెడ్డి సీటుపై టీజేఎస్‌ గురిపెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ జరుపుతున్నారని, రైతులు, రైతు కూలీల జీవితాలతో ముడిపడి ఉన్న భూమిని లాక్కుంటున్న ప్రభుత్వం వారికి సరైన పరిహారం ఇవ్వడం లేదంటూ హైకోర్టులో కేసులు దాఖలు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన న్యాయవాది రచనారెడ్డిని అసెంబ్లీ బరిలో నిలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు నాయకుడు బొల్లు నర్సింహారెడ్డి కూతురైన రచనారెడ్డి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.

హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై బాధితుల తరపున పలు కేసులు నమోదు చేసి వార్తల్లోకెక్కారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా రచనారెడ్డి పేరును ఉచ్చరించారు. బాధితుల తరపున రచనారెడ్డి వకాల్తా పుచ్చుకోవడమే గాకుండా ముంపు రైతుల తరపున జరిగిన ఉద్యమాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దీంతో తక్కువ సమయంలోనే పాపులర్‌ అయ్యారు. ఉన్నత కుటుంబంలో పుట్టి, విదేశాల్లో విద్యనభ్యసించినప్పటికీ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఆమె పేద ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఇటీవలే తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు.
 
అందరి దృష్టి ఎల్లారెడ్డిపైనే.. 
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి తదితర పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పాటైన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ స్థానాలలో కాంగ్రెస్‌ పార్టీనే పోటీ చేసే అవకాశాలు ఉండడంతో ఇక అందరి దృష్టి ఎల్లారెడ్డి నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడ అధికార పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. ఆయన ప్రచారాన్ని ఉధృతం చేశారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఎల్లారెడ్డి సీటు తమకే కావాలని కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా కోరుతోంది. కాంగ్రెస్‌ టికెట్టు కోసం నలుగురైదుగురు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా ఎల్లారెడ్డి సీటు తమకు కేటాయించాలని టీజేఎస్‌ కోరుతోంది. రచనారెడ్డిని మహాకూటమి అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చలు జరుగుతుండడం హాట్‌టాపిక్‌గా మారింది. 

ఆశావహుల్లో ఆందోళన 
ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు కోసం నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. మొదటి నుంచి పార్టీ టికెట్టు కోసం ముందు వరుసలో ఉన్న నియోజక వర్గ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సుభాష్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు జమునారాథోడ్, మరో నాయకుడు కృష్ణారెడ్డి టికెట్టు ఆశిస్తున్నారు. జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న మదన్‌మోహన్‌రావ్‌ కూడా ఎమ్మెల్యే సీటుపై కన్నేశా రు. ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ను పార్టీ అధిష్టానం ముందుంచారు. అయితే టికెట్టు విషయంలో కాంగ్రెస్‌లోనే తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సమయంలో మహాకూటమి అభ్యర్థిగా న్యాయవాది రచనారెడ్డి పేరును పరిశీలిస్తున్నారన్న ప్రచారంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని నిలుపుతుందా? తెలంగాణ జన సమితికి వదులుతుందా? అన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు