వారికి ఓటెందుకు వేయాలి: కిషన్‌రెడ్డి 

29 Mar, 2019 03:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ఎజెండా లేదని, అటువంటి పార్టీలకు ఓటెందుకు వేయాలని మాజీ ఎమ్మెల్యే, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పేదరిక నిర్మూలన బీజేపీ ఎజెండాగా పెట్టుకుంటే, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మోదీని ఆపడమే లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రజల కోరికల్నే తమ ఎజెండాగా చేసుకున్న ప్రధాని మోదీ కావాలో, కుటుంబ ప్రయోజనాల్నే తమ ఎజెండాగా చేసుకున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు కావాలో తేల్చుకోవాలన్నారు. దేశభద్రతపై మోదీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలను కాంగ్రెస్‌ విమర్శించడం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే వాటి రుజువులు కావాలని రక్షణ బలగాలను కాంగ్రెస్‌ అవమానించిందన్నారు. ఇప్పటివరకూ శిఖరంపై ఉన్న టీఆర్‌ఎస్‌కు కిందికి దిగడం ప్రారంభమైందన్నారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికలతో అది పూర్తవుతుందని, అందుకే కేసీఆర్, కేటీఆర్‌ అడ్డగోలుగా బీజేపీని విమర్శిస్తున్నారని తెలిపారు.   

మరిన్ని వార్తలు