పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా జీవన్రెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గూడూరు.. నేడు అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టభద్రుల నియోజకవర్గం, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఆదిలాబాద్–కరీంనగర్–నిజామాబాద్–మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి టి.జీవన్రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఉత్తర తెలంగాణలో మంచి పేరున్న నాయకుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఈ అవకాశం ఇచ్చింది. ఇక, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లే. ఈ సీటు విషయంలో గూడూరుతో పాటు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి శశిధర్రెడ్డిల పేర్లను టీపీసీసీ కమిటీ అధిష్టానానికి పంపింది.
ఎమ్మెల్సీ పొంగులేటి తనకు మరో అవకాశం ఇవ్వాలని పట్టుబట్టడం, రాహుల్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన పేరును అధిష్టానం పరిశీలించింది. కానీ చివరి నిమిషంలో గూడూరు వైపు మొగ్గు చూపింది. అనూహ్య పరిణా మాలు సంభవిస్తే తప్ప ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు గురువారం నామినేషన్ దాఖ లుచేయనున్నారు. జీవన్ రెడ్డి పేరును బుధవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం కావడంతో రెండు స్థానాల్లో అభ్యర్థులను ఏఐసీసీ గురువారం అధికారికంగా ప్రకటించనుంది.