కేంద్రంలో ఏర్పడేది కాంగ్రెస్‌ సర్కారే 

25 Mar, 2019 17:11 IST|Sakshi
 గజమాలతో రేణుకాచౌదరి,  ఎమ్మెల్యే మెచ్చా, కోనేరు చిన్నిని సన్మానిస్తున్న దృశ్యం 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యం 

కాంగ్రెస్‌ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి  

సాక్షి, ఖమ్మం: శాసనసభలో సంపూర్ణ మెజార్టీ ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇతర పార్టీల శాసనసభ్యులను, నేతలను ఆ పార్టీలో చేర్చుకొని ఏం సాధిస్తారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి గారపాటి రేణుకాచౌదరి ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న నేతలను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకోవటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయమని, జిల్లా ప్రజల గొంతుగా ఉన్న తనను పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు గెలిపించుకొని పార్లమెంట్‌కు పంపిస్తారని పేర్కొన్నారు.

తన హయాంలో జరిగిన అభివృద్ధి మినహా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈసారి తాను విజయం సాధించటం ద్వారా జిల్లా పురోభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తానని, ఆ తర్వాత స్వచ్ఛంద రాజకీయ విరమణ చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో విలువలను నిలబెట్టేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లా ఆడబిడ్డగా పేరు తెచ్చుకున్న తాను ఉమ్మడి కుటుబంలాగా తాను భావిస్తున్నానన్నారు. పదవి ఉన్నా లేకున్నా తాను ప్రజల కోసం పని చేస్తానన్నారు. తాను ఎంపీగా చేసిన సమయంలో మత్స్యకారులను ఆదుకోవటంతో పాటు పాలేరు నుంచి పర్ణశాల వరకు వివిధ పర్యాటక ప్రాంతాల ను అభివృద్ధి చేశానన్నారు.

గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసిన రైతులను బేడీలు వేస్తే తాము అండగా ఉన్నామన్నారు. ఆదివాసీ, గిరిజనులకు ఎంతో మేలు చేశానన్నారు. గిరిజన బెటాలియన్‌ ఏర్పాటుకు కృషి చేయటం వలనే ప్రస్తుతం అనేక మంది మిలట్రీ రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యారన్నారు.   దేశవ్యాప్తంగా అనేక చట్టాలు అమలు చేసేందుకు తన వంతుగా కృషి చేశాన న్నారు. అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయటం తో పాటు ఆర్చెరి, స్పోర్ట్స్, ఇండోర్‌ స్టేడియం లాంటి అనేక కార్యక్రమాలను అమలు చేశానన్నారు. గతంలో స్తంభాద్రి ఉత్సవాలు ఒక పండగ వాతావరణంలో జరిగాయని, ఆ తర్వాత వాటిని పట్టించుకున్న వారు లేరన్నారు.  

తనను క్యాడరే గెలిపించుకుం టుందనే నమ్మకం అధిష్టానంలో ఉందని, అందుకే తనకు టికెట్‌ కేటాయించారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు తనకు ప్రభుత్వానికి మధ్యనేనని, టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును పట్టించుకోనన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మల్లు రమేష్, మానుకొండ రాధాకిషోర్, నాగండ్ల దీపక్‌చౌదరి, మేళం శ్రీనివాస్‌యాదవ్, ఏకే రామారావు, రాయల శేషగిరిరావు, చోటా బాబా, పగడాల మంజుల, బండి మణి, జావీద్‌  పాల్గొన్నారు.

 జిల్లాను ఎంతో అభివృద్ధి చేశా: రేణుకా చౌదరి 
ఖమ్మంఅర్బన్‌: తన హయాంలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని ఖమ్మం పార్లమెంట్‌  కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ఆదివారం బైపాస్‌ రోడ్డులోని సప్తపది çఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తనకు సీటు కేటాయించడం బహుమతి కాదని బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాలో ఎంపీగా, రాజ్యసభ సభ్యురాలుగా రోడ్డు వంతెనలు, పర్యాటపరంగ, సంక్షేమం అనేక రంగాల్లో నిధు లు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. 

సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,  కొత్తగూడెం పార్టీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని), మధిర నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ రామనాథం, నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, గంగాధర్‌ చౌదరి మాట్లాడారు. సీనియర్‌ నాయకులు వల్లంకొండ వెంకటరామయ్య, కూరపాటి వెంకటేశ్వర్లు, జట్ల శ్రీనివాస్, జయాకర్, అయితం రామారావు, వివిధ మండలాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు