టీఆర్‌ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుల దాడి

18 May, 2014 23:57 IST|Sakshi

కౌడిపల్లి, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గంగారంలో చోటుచేసుకుంది. బాధితుడు హరినాథ్‌రెడ్డి, అతని తల్లి విజయ, మాజీ కోఆప్షన్ సభ్యుడు ముజాహిద్ హుస్సెన్, గ్రామస్తుల కథనం ప్రకారం... గంగారం గ్రామానికి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభాకర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు, ఎత్తిపోతల పథకం సాగునీరు, పింఛన్లు ఇక నుండి బంద్ చేస్తామని, ఆదివారం గ్రామస్తులంతా గ్రామ చావిడివద్దకు రావాలని చాటింపు వేయించాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామస్థులందరు గ్రామచావిడివద్దకు వచ్చారు.

 పనులు, సాగునీరు ఎందుకు బంద్‌చేస్తారని గ్రామస్థులతోపాటు హరినాథ్‌రెడ్డి ప్రశ్నించాడు. ఇదేవిషయంపై గ్రామస్థుడు శంకర్ మాట్లాడుతూ తమకు కొన్ని నెలలుగా ఉపాధి హామీ కూలి డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదని ఫీల్డ్ అసిస్టెంట్‌ను నిలదీయగా అతనికి హరినాథ్‌రెడ్డి మద్దతు పలికాడు. దీంతో  అడిగేందుకు మీరెవరంటు ఫీల్డ్‌అసిస్టెంట్ దూషించగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి గ్రామస్థుల సమక్షంలోనే హరినాథ్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడిపై ఫిర్యాదు చేశారు.

అయితే కేసు ఇంకా నమోదు కాలేదని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఎన్నికల్లలో కాంగ్రెస్ పార్టీకి ఓట్టువేయలేదన్న కక్షతోనే గ్రామంలో పనులు బంద్‌చేయస్తామని చాటింపు వేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ పనులు బంద్ చేస్తామంటు  చాటింపుచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని బాధితుడి తల్లి కోరింది.

మరిన్ని వార్తలు