కాంగ్రెస్‌.. దూకుడు!

12 Oct, 2018 12:47 IST|Sakshi
త్రిపురారం : ప్రచారంలో భాగంగా ఓపెన్‌టాప్‌ జీపుపై జానారెడ్డి తదితరులు

అభ్యర్థుల ప్రకటన రాకముందే ప్రజల్లోకి..

సాక్షిప్రతినిధి, నల్లగొండ : అభ్యర్థుల ప్రకటన రాకుండానే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. సిట్టింగులు ఉన్న చోట ప్రచారం మొదలు పెట్టారు. కచ్చితంగా తమకే టికెట్‌ దక్కుతుందన్న ఆశాభా వం ఉన్న నాయకులూ ప్రజల్లోకి వెళుతున్నారు. సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గం చుట్టివస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించక ముందునుంచే ముందస్తు ఎన్నికలు వ స్తాయన్న అంచనాతో గ్రామాల్లో పర్యటించిన ఆయన ఇప్పుడు అర్బన్‌ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ప్రతిరోజూ మండలాల్లో, లేదంటే నల్ల గొండ పట్టణంలో ప్రచారం చేస్తున్నారు.

కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉన్నవారు, అనివార్య పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌లో వెళ్లిన తన మాజీ అనుచరులను దగ్గరకు తీసుకోవడంలో మునిగిపోయారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన భారీ సంఖ్యలో మోటారు వెహికిల్స్‌తో ర్యాలీ నిర్వహించారు. చేరికలతో పాతవారిని దగ్గరకు తీస్తున్నారు. మరోవైపు సీఎల్పీ మాజీ నేత కుందూ రు జానారెడ్డి సైతం ప్రచారానికి శ్రీకారం చుట్టా రు. ఆయన గురువారం త్రిపురారం రామాలయంలో పూజలు చేసి, ఆ మండల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రచారాలకు ఇంకా గ్రామాలకు వెళ్లకున్నా.. పార్టీ కార్యకర్తలను సంసిద్ధం చేయడానికి ఈ సమావేశాన్ని ఉపయోగించుకున్నారు.

గుర్రంపోడు మండలంలో పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే విధంగా కోమటిరెడ్డి అనుచరనేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం నకిరేకల్‌లో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సైతం కార్యకర్తలతో సమావేశాలు జరుపుతున్నారు. టికెట్‌ తమకే దక్కుతుందన్న నమ్మకం ఉన్న నాయకులు ఇప్పటికే ప్రజల్లోకి వెళుతున్నారు. శనివారం జిల్లాలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ప్రచారానికి రానున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గ నేతలు ఇప్పటికే దూకుడు పెంచా రు. శనివారం దేవరకొండ, మునుగోడు నియోజ కవర్గాల్లో ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షు డు మల్లు భట్టి విక్రమార్క, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ప్రచారం చేయనున్నారు. ఆది వారమూ జిల్లాలోనే వారి ప్రచారం సాగనుంది.  

స్క్రీనింగ్‌ కమిటీ జాబితా ఇలా...
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆయా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల జాబితాను వడబోసే పనిలో పడింది. ఇప్పటికే కాంగ్రెస్‌  జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌..  స్క్రీనింగ్‌ కమి టీ అధ్యక్షుడు భక్తచరణ్‌ దాస్‌తో భేటీ అయ్యి, జాబితా ఖరారుపై కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒకే పేరును పరిగణనలోకి తీసుకున్న నియోజకవర్గాల్లో వరుసగా.. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోదాడ ఉత్తమ్‌ పద్మావతి, హుజూర్‌నగర్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, నాగార్జునసాగర్‌ కుందూరు జానారెడ్డి, సూర్యాపేట ఆర్‌.దామోదర్‌ రెడ్డి, ఆలేరులో బూడిద భిక్షమయ్యగౌడ్‌ ఉన్నారని సమాచారం.

ఇక, మూడు పేర్లను పరిగణనలోకి తీసుకున్న నియోజకవర్గాల్లో మునుగోడునుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్న కైలాస్‌ నేత, దేవరకొండలో బాలునాయక్, జగన్‌లాల్‌ నాయక్, బిల్యానాయక్, భువనగిరిలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రమోద్‌ కుమార్, కల్పన, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, కొండేటి మల్లయ్య, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, డాక్టర్‌ రవి, జ్ఞానసుందర్, మిర్యాలగూడ నియోజకవర్గంలో   రఘువీర్‌రెడ్డి, రామలింగం యాదవ్, కృష్ణయ్య పేర్లను తుదిజాబితాలో చేర్చారని గాంధీభవన్‌ వర్గాల సమాచారం. అభ్యర్థుల పేర్లను కుదించడంలోనూ రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహా కూటమి భాగస్వామ్య పక్షాలతో కుదిరే పొత్తు, ఒప్పందాల మేరకు వీటిలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అనుకోని పరిణామాలవల్ల గానీ, అనివార్య పరిస్థితుల వల్ల గానీ సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి  మిర్యాలగూడ నియో జకవర్గానికి మారితే, నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడానికి టీఆర్‌ఎస్‌లోని ఒక నేతతో ఇప్పటికే మాట్లాడారని కూడా చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు