చివరి ప్రయత్నాల్లో ఆశావహులు ఢిల్లీకి క్యూకట్టిన కాంగ్రెస్ నేతలు
తాండూరు, వికారాబాద్ టికెట్ల కోసం ముమ్మరంగా లాబీయింగ్
కాంగ్రెస్ గెలుపు గుర్రాల ప్రకటనకు తుది కసరత్తు జరుగుతున్న వేళ.. తాడో పేడో తేల్చుకునేందుకు జిల్లా నేతలు సిద్ధమయ్యారు. ఈ దశలో ఏఐసీసీ ప్రతినిధులు, స్టీరింగ్ కమిటీ సభ్యులను ప్రసన్నం చేసుకునే దిశగా చివరి ప్రయత్నాలకు పదును పెట్టారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ విషయం తెలిసిన ఆశావహులు ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే పలువురు నేతలు దేశ రాజధానిలో మకాం వేయగా.. మంగళవారం ఉదయం ఢిల్లీ చేరుకునేలా మరికొంత మంది ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా తాండూరు, వికారాబాద్కు చెందిన ఆశావహులు కొద్ది రోజులుగా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
సాక్షి, వికారాబాద్: జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కానుందనే సమాచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొడంగల్, పరిగి స్థానాలు తాజా మాజీ ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, రామ్మోహన్రెడ్డికి ఇప్పటికే ఖరారయ్యాయని తెలుస్తోంది. దీంతో వీరు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో వీరికి పోటీ కూడా లేకపోవడంతో అధిష్టానం వీరి పేర్లను ఖరారు చేసిందని సమాచారం.
మహరాజులు వర్సెస్ రోహిత్రెడ్డి...
తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కోసం రసవత్తర పోటీ సాగుతోంది. నాలుగైదు దశాబ్దాలుగా కాంగ్రెస్లో అన్నీ తామై పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మహరాజుల కుటుంబం, ఇటీవల పార్టీలో చేరిన యంగ్లీడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు రోహిత్రెడ్డి మధ్య టికెట్ పోరు తార స్థాయికి చేరింది. టికెట్ సాధనకోసం ఇప్పటికే మహారాజుల కుటుంబం నుంచి రాకేష్, నరేష్లు ఢిల్లీలో పైరవీలు ముమ్మరం చేశారు.
అదే విధంగా రోహిత్రెడ్డి సైతం ఢిల్లీలో తనకు అనుకూలమైన నేతలతో టికెట్ వేటలో ఉన్నారు. ఈ తతంగం జరుగుతుండగానే మాజీ ఎమ్మెల్యే నారాయణరావు వర్గీయులు సోమవారం తన అనుచరులతో కలిసి నగరంలో టీపీసీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వద్దకు వెళ్లి టికెట్ తమ వర్గానికే ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
తాండూరు నియోజకవర్గంలో 65 శాతానికి పైగా ఉన్న బీసీలకే కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని, కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కాదని ఇతర వర్గాలకు ఇస్తే పార్టీ ఓడిపోయే ప్రమాదముందని విన్నవించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే రోహిత్రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికప్పుడే పార్టీలో చేరినవారికి టికెట్లు ఇవ్వకూడదని.. రాహుల్ గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో రోహిత్కు ఎట్టి పరిస్థితిలోనూ టికెట్ రాదనే ప్రచారం జరుగుతోంది.
గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే సూత్రం ప్రకారం రోహిత్రెడ్డికే టికెట్ వస్తుందని, వరుసగా ఓటమి పాలయ్యే మహరాజుల కుటుంబానికి గాని, ఆయన అనుచరులకు గాని టికెట్ ఇచ్చే అవకాశమే లేదని రోహిత్రెడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు. మొత్తానికి టికెట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ పరిణమాలన్నీ టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి మహేందర్రెడ్డి తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
వికారాబాద్లో పోటాపోటీ...
వికారాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్కుమార్, డాక్టర్.ఏ చంద్రశేఖర్ హోరాహోరీగా పోటీపడుతున్నారు. వీరు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రతినిధులు, స్క్రీనింగ్ కమిటీ సభ్యులను కలిసి లాబీయింగ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు రాష్ట్ర స్థాయి నేతలను కూడా కలిసి టికెట్ కోసం అభ్యర్థించారు. కాగా ఇద్దరు మాజీ మంత్రులు మాత్రం టికెట్ విషయంలో ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరికి వారుగా ప్రచారం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ప్రకటిస్తుందని తెలియడంతో చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.