‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌ ప్రలోభాలు’

4 Mar, 2019 02:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈవీ ఎంలను అడ్డం పెట్టుకుని, అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్, ఇప్పుడు ప్రజా తీర్పును సైతం అవహేళన చేస్తూ ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టే పనిలో పడిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చే రీతిలో ఆపరేషన్‌ ఆకర్‌‡్ష పేరుతో టీఆర్‌ఎస్‌ అకృత్యాలపై ప్రతిపక్షాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్‌ వెనువెంటనే వేటు వేశారని, అయితే కాంగ్రెస్, టీడీపీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిపై స్పీకర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్‌ ఎలాంటి వివాదాలకు తావివ్వని రీతిలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు