మహాసభల్లో సీపీఎం ‘జనజాతర’

25 Jan, 2015 01:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వామపక్ష భావజాలం కలి గిన సాంస్కృతిక, ప్రజా కళాబృందాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని సీపీఎం నిర్ణయిం చింది. తెలంగాణలో ప్రజా సంస్కృతికి అద్దం పట్టే కళారూపాలను ‘జనజాతర’ పేరిట నిజాం కాలేజీ మైదానంలో ప్రదర్శించే యోచనతో ఉంది. సీపీఎం తెలంగాణ తొలి మహాసభలు మార్చి 1-4 తేదీల మధ్య హైదరాబాద్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రజారంగంలో పని చేస్తున్న కళాబృందాలతో రెండురోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. సమాజంలోని వామపక్ష శక్తులు, అభిమానులు, మద్దతుదారులను రాజకీయంగా ఒకవేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే.. తెలంగాణలోని వామపక్ష సాం స్కృతిక బృందాలు, వ్యక్తులను కూడా ఒకచోటకు తీసుకురానుంది.

తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించి, సిద్ధాంతపరంగా, ఇతరత్రా కారణాల వల్ల పలు వామపక్షశక్తులు దూరాన్ని పాటిస్తున్నాయి. ప్రజా గాయకులు గద్దర్, విమలక్క, జయరాజ్ వంటి వారిని కూడా ఆహ్వానించి, తమ తమ సాంస్కృతిక సంస్థల పేరుమీదే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలనే ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
 

మరిన్ని వార్తలు