‘టీపీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం’

26 May, 2019 06:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ గెలుపుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నా యని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన మోసం, అవినీతి, కుంభకోణాలను రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు గుర్తుంచుకున్నారని, అందుకే కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఈ విషయాన్ని గ్రహించకపోవడం వారి అజ్ఞానాన్ని తెలియజేస్తోందని ఆయన ఎద్దేశా చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతోందని, అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి, నాలుగో స్థానానికి పరిమితమైనప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన శాసనసభ్యులు పార్టీని నమ్మలేక టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాలుగు లోక్‌ సభ స్థానాల్లో ఘన విజయం సాధించడమే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీని నేల మట్టం చేసిందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా మూడు సీట్లలో కాంగ్రెస్‌.. అతి తక్కువ మెజార్టీతో బయట పడిందని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా కొద్ది నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు

మరిన్ని వార్తలు