నేటి నుంచి 48 గంటల దీక్ష

2 May, 2019 02:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకలను సరిచేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. అందులో భాగంగా గాంధీభవన్‌ వేదికగా ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో గురువారం నుంచి 48 గంటల దీక్ష నిర్వహించనుంది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్‌లు ఈ దీక్షలో పాల్గొననున్నారు.

ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులందరి సమాధానపత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను తప్పించడం, విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి బర్తరఫ్, గ్లోబరీనా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టడం వంటి డిమాండ్లతో ఈ దీక్షకు దిగుతున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు