సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్తానంపై చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన పొన్నాల.. కొన్ని నెలల నుంచి పూర్తిగా మౌనముద్రలో ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసిం చిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే పెద్ద కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరికి తన సొంత నియోజకవర్గం జనగామకు కూడా అరుదుగానే వస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య రాజకీయ పయనం ఎటు వైపు అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
అప్పట్లో అన్నీ తానై..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు పొన్నాల లక్ష్మయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో శాసించారు. రెడ్యానాయక్, కొండా సురేఖ, బస్వరాజు సారయ్యలు మంత్రులుగా పనిచేసినా... కాంగ్రెస్ వ్యవహారాలన్నీ పూర్తిగా పొన్నాల నిర్ణయంతోనే జరిగాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అ«ధ్యక్షుడిగా నియమితులయ్యారు. కీలకమైన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్కు సారథిగా వ్యవహరించారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో పొన్నాల రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ పదవిని వదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
2019 ఎన్నికలకు ఎవరు దిక్కు..!
గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో కీలకంగా పనిచేసినా, వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లోనూ పొన్నాల తన ప్రభావాన్ని కొనసాగించారు. మరో వైపు కాంగ్రెస్లో అప్పటి వరకు కీలకంగా పనిచేసిన డీఎస్.రెడ్యానాయక్, కొండా సురేఖ, బస్వరాజు సారయ్యలు టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్లో కీలక నేతలు లేని పరిస్థితి నెలకొంది. అయితే 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు పెద్ద దిక్కు ఎవరనే అంశంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కష్టకాలంలో నాయకత్వం వహించి పార్టీని నడిపించాల్సిన పొన్నాల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన సందర్భాలలో పొన్నాల తీరు అసంతృప్తిగా ఉంటోందని అంటున్నారు. స్వయంగా కార్యక్రమాలను నిర్వహించడం విషయం ఎలా ఉన్నా... కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల ప్రకారం జరిగే కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు.