పోటీ పరీక్షలకు నిరంతర శిక్షణ: జోగు

22 Jun, 2018 02:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సివిల్స్, గ్రూప్స్‌ తదితర పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్స్‌ ద్వారా నిరంతరంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి జోగు రామన్న అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్‌ అనితా రాజేందర్, బీసీ స్టడీ సర్కిల్‌ రాష్ట్ర సంచాలకులు గొట్టిపాటి సుజాత, ఇతర అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ, బీసీ అభ్యర్థులు పోటీ పరీక్షల్లో రాణించే విధంగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, లైబ్రరీ, శిక్షణకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంచాలన్నారు. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్‌లో నిర్మాణాల్లో ఉన్న స్టడీ సర్కిల్‌ భవనాలు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు