ఆదిలాబాద్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు బుధవారం ఉదయం సమ్మెకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి లోని రామకృష్ణ ఓపెన్ కాస్ట్లో పని చేసే కాంట్రాక్టు కార్మికులు విధులకు హాజరుకాలేదు. డాట్ కంపెనీ వారు విధులకు హాజరుకమ్మని కార్మికులపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ కాంట్రాక్టు కార్మికులు ససేమిరా అంటున్నారు.
మందమర్రి పరిధిలో దాదాపు 25 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి జేకే ఓపెన్ కాస్ట్ ముందు కాంటాక్ట్ కార్మికులు బుధవారం ఉదయం ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమాన్ని ఆపేదిలేదని చెప్పారు.